యూఎస్ కీలక నిర్ణయం- నవంబర్ 8 నుంచి వ్యాక్సిన్ వేయించుకున్న విదేశీయులకు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు తిరిగి క్రమంగా ప్రారంభమవుతున్నాయి. ఇదే క్రమంలో అమెరికాలోని జో బైడెన్ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ప్రయాణికుల్ని దేశంలోకి అనుమతించేందుకు వీలుగా ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 8 నుంచి విదేశీ ప్రయాణికుల్ని దేశంలోకి అనుమతించాలని వైట్ హౌస్ నిర్ణయం తీసుకుంది. అయితే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యాక్సిన్ వేయించుకున్న విదేశీ ప్రయాణికుల్ని భూ, వాయు మార్గాల్లో నవంబర్ 8 నుంచి అనుమతించనున్నట్లు ప్రకటించింది. గతేడాది మార్చిలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు వీలుగా అమెరికా సరిహద్దులు మూసేసింది. విదేశీ ప్రయాణికుల్ని అప్పటి నుంచీ దేశంలోకి అనుమతించడం లేదు.
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదించడం, వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య కూడా పెరగడం, ఇతర దేశాలు కూడా ప్రయాణికుల్ని అనుమతిస్తుండటం వంటి కారణాలతో విదేశీ ప్రయాణికుల విషయంలో సడలింపులు ఇవ్వాలని వైట్ హౌస్ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కారణంగా విదేశీ నిపుణుల కొరత ఏర్పడటం కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. గతంలో తాము వీసాలు జారీ చేసినా కరోనా ఆంక్షల కారణంగా విదేశీ నిపుణులు యూఎస్ రాలేకపోయారు. ఆ మేరకు యూఎస్ లోని వివిధ రంగాలపై ప్రభావం పడుతోంది. దీంతో ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం యూఎస్ వెళ్లాలనుకునే ప్రయాణికులు మూడు రోజుల ముందు వ్యాక్సిన్ వేయించుకుని ఉండటంతో పాటు పరీక్షలు కూడా చేయించుకోవాలి. వాస్తవానికి విదేశీ ప్రయాణికుల్ని రెండు దశల్లో యూఎస్ లోకి అనుమతించాలని వైట్ హౌస్ నిర్ణయించింది. ఇందులో అత్యవసర ప్రయాణాలు కాకపోతే మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు. అత్యవసర ప్రయాణాలు అయితే వ్యాక్సిన్ లేకుండా కూడా అనుమతించనున్నారు. 2022 జనవరి నుంచి మాత్రం అందరినీ వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా అనుమతించే అవకాశముంది.