కరోనా విలయం: అగ్రరాజ్యాల్లో డెత్ రేస్.. అమెరికా టాప్.. యూకే మోస్ట్ వరస్ట్.. రాబోయేది గడ్డుకాలం
సర్వశక్తిమంతులుగా, అగ్రరాజ్యాలుగా విలసిల్లిన దేశాలు కరోనా వైరస్ దెబ్బకు బావురుమంటున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అత్యంత విషాదకరంగా మరణాల సంఖ్యలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. అమెరికా(యూఎస్), యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో కొవిడ్-19 ఎఫెక్ట్ ను కళ్లారా చూస్తోన్న మిగతా దేశాలు.. తమ పరిస్థితి తల్చుకుని వణికిపోతున్నాయి. ఆదివారం రాత్రి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 18లక్షలకు పెరిగింది. అందులో 4.12లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మొత్తం 1.10లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పైకెళుతుండటం గమనార్హం.
అమెరికా ఫస్ట్..
నార్త్, సౌత్ అనే తేడాల్లేకుండా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రభావం చూపుతున్నది. ప్రస్తుతానికి ప్రపంచంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతున్న అమెరికాలో రికార్డు స్థాయిలో 5.3లక్షల మందికి వైరస్ సోకింది. అందులో కేవలం 30వేల మంది మాత్రమే కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, ఇప్పటిదాకా 20,610 మంది చనిపోయారు. ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించలేదు. ఇప్పటికీ అక్కడ సుమారు 12వేల మంది క్రిటికల్ కండిషన్ లో ఉండటాన్ని బట్టి చావుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో వైరస్ ఎపిసెంటర్ గా భావిస్తోన్న న్యూయార్క్ లో పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువకాగా, 8650 మరణాలు సంభవించాయి. న్యూజెర్సీ 2,183, మిషిగన్ 1384 మరణాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వేటాడే వైరస్..
ఇప్పటికే వైరస్ భయంతో వణికిపోతున్న దేశాలను మరింత కలవరపెట్టేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అంతర్జాతీయ ప్రెస్ తో మాట్లాడిన ఆయన.. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభావం తగ్గడానికి బదులు.. కరోనా వైరస్ మరింత యాక్టీవ్ గా, వేగంగా విజృంభిస్తున్నదని, బహుశా మానవాళిని సుదీర్ఘకాలంపాటు వేటాడే వైరస్ కరోనానే కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని డాక్టర్ డేవిడ్ అన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విమర్శలపై స్పందిస్తూ.. WHO ఏ ఒక్క దేశానికీ అనుకూలంగా పనిచేయదని, అందరినీ సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు.
యూరప్ లో యూకేనే వరస్ట్..
ఆదివారం నాటికి పాజిటివ్ కేసులు, మరణాల పరంగా యూరప్ లో స్పెయిన్, ఇటలీ ఫ్రాన్స్ ముందున్నాయి. స్పెయిన్ లో 1.66లక్షల కేసులు, 17వేల మరణాలు చోటుచేసుకోగా, ఇటలీలో 1.52లక్షల కేసులు, 19,468 మరణాలు సంభవించాయి. ఫ్రాన్స్ లో 1.29 లక్షల కేసులు, 13,832 మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతానికి కేసులు లక్ష కూడా దాటకుండానే(84,279) మరణాల సంఖ్య 10,612గా నమోదైంది. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే యూకేలో.. రాబోయే రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయని సాక్ష్యాత్తూ ఆ దేశ సైంటిఫిక్ అడ్వైజర్ సర్ జెర్మీ ఫరార్ హెచ్చరించారు.
ప్రధాని బోరిస్ డిశ్చార్జి..
కొవిడ్-19 వ్యాధికి గురై, ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పూర్తిగా కోలుకుని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజులపాటు ఐసీయూలో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఇంట్లోనూ చికిత్స కొనసాగుతుందని అధికారులు చెప్పారు. తనకు సేవలందించిన సెయింట్ థామస్ ఆసుపత్రి సిబ్బందికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. లండన్ శివార్లలో ఉన్న ఆయన ఫార్మ్ హౌస్ చెకర్స్లో విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. వైద్య బృందం సలహా మేరకు బోరిస్ జాన్సన్ ఇప్పటికిప్పుడే విధుల్లో పాల్గొనబోరని తెలిపారు.
ఇండియాలో ఇలా..
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇండియాలో ఆదివారం సాయంత్రం నాటికి మొత్తంగా 8,356 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 273 మంది ప్రాణాలు కోల్పోగా, 764 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ గా ఉన్న 7409 కేసుల్లో సుమారు 1700 మంది కండిషన్ క్రిటికల్ ఉందని, మరో 20 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా సహా 13 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపినట్లు తెలిపింది. కాగా, అమెరికాకు మందులు, టెస్టింగ్ కిట్లు పంపడం వల్ల దేశంలో కొరత ఏర్పడిందని, క్లస్టర్ జోన్లలో కూడా పరీక్షలు నిర్వహించేందుకు సరిపడా కిట్లు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆరోపించింది.