ప్రధాని మోడీతోపాటు భారత కీలక ట్విట్టర్ ఖాతాల అన్ఫాలో: వైట్హౌస్ వివరణ ఇదే
వాషింగ్టన్: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను అన్ఫాలో చేయడంపై అమెరికా అధికారిక భవనం వైట్హౌస్ (శ్వేతసౌధం) వివరణ ఇచ్చింది. అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో భారతీయుల నుంచి పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిగివచ్చింది.
అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలోనే..
విదేశీ పర్యటనలో సమయంలో అమెరికా అధ్యక్ష భవనం ఆయా దేశ అధినేతలు, వారి కార్యాలయాలను ట్విట్టర్లో తాత్కాలికంగా మాత్రమే అనుసరిస్తుందని స్పష్టం చేసింది. అధ్యక్షుడి పర్యటన పూర్తయిన తర్వాత వీటిని అన్ఫాలో చేయడం సాధారణ ప్రక్రియ అని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ట్రంప్ భారత్లో పర్యటించడంతో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి నెలలో భారత్ పర్యటించిన సమయంలో శ్వేతసౌధం భారత రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆరు ట్విట్టర్ ఖాతాలను అనుసరించింది. ఈ వారంలో మొదట్లో ఆ ఆరు ఖాతాలను వైట్హౌస్ అన్ఫాలో చేసింది.
రాహుల్ అలా.. నెటిజన్ల విమర్శలు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. మా రాష్ట్రపతి, ప్రధాని ట్విట్టర్ ఖాతాలను వైట్ హౌస్ అన్ఫాలో చేయడంతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ గమనించాలని కోరుతున్నట్లు బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, పలువురు నెటిజన్లు ఈ పరిణామంపై వైట్ హౌస్ను విమర్శించారు. దీంతో శ్వేత సౌధం వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video
13 ఖాతాలనే ఫాలోఅవుతున్న వైట్హౌస్.. అవేమంటే..
ప్రస్తుతం వైట్ హౌస్ కేవలం 13 ఖాతాలనే అనుసరిస్తోంది. వాటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు, రెండవ మహిళ, న్యూ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్నానీ, జాతీయ భద్రతా మండలి, మాజీ వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి స్టెఫానీ గ్రిషామ్ తదితరులు ఉన్నారు.కాగా, వైట్హౌస్ ట్విట్టర్ ఖాతాను దాదాపు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు.