టార్గెట్..52: మా వాళ్ల జోలికి గానీ వస్తే..వినాశనం: ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్: దాడులపై తొలిసారిగా.. !
న్యూయార్క్: ఇరాక్ పై అమెరికా వైమానిక దళాలు నిర్వహించిన దాడి..మధ్య తూర్పు దేశాల్లో యుద్ధ వాతావరణానికి కేంద్రబిందువైంది. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితిని కల్పించినట్టయింది. వైమానిక దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నాయి అక్కడి దేశాలు. తమ సైన్యాధ్యక్షుడిని అమెరికా ఉద్దేశపూరకంగానే హతమార్చిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లంచుకోక తప్పదంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది.
ఫస్ట్ రియాక్షన్..
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దళాల దాడిలో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని దుర్మరణం పాలయ్యారు. దీనితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగొచ్చంటూ మధ్య తూర్పు దేశాల నుంచి వార్తలు వస్తోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాక్ పై వైమానిక దాడులు తరువాత డొనాల్డ్ ట్రంప్ పెదవి విప్పడం ఇదే తొలిసారి.
మా వాళ్ల జోలికి వస్తే.. వినాశనం
అమెరికన్లపై గానీ, ఆ దేశానికి చెందిన ఆస్తులపై గానీ ప్రతిదాడులను చేయాలనే వ్యూహాలు ఏవైనా ఉంటే.. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. అసలు అలాంటి ఆలోచనే చేయొద్దని హితవు పలికారు. అమెరికన్లు, అమెరికన్ల ఆస్తులపై దాడులకు దిగితే. ఆ తరువాతి పరిణామాలను ఇరాన్ ఏ మాత్రం అంచనా వేయలేదని అన్నారు. వినాశనం తప్పదని, ఇరాన్ కు చెందిన అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని చెప్పారు.
టార్గెట్ లిస్టులో 52 స్థావరాలు..
ఇరాన్ కు చెందిన మొత్తం 52 స్థావరాలకు సంబంధించిన పూర్తి వివరాలను తాము సేకరించామని, వాటి ఆనుపానులు తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఈ 52 స్థావరాలపై తాము దాడులు చేయడమంటూ జరిగితే.. అది అక్కడితో ఆగేది కాదనీ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ సంస్కృతికి ప్రతిబింబింపజేసే కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపదలను సైతం ఈ జాబితాలో చేర్చామని, వాటన్నింటినీ కోల్పోక తప్పదని అన్నారు.
ఖాసిం సోలేమని దుర్మరణం పాలైన అనంతరం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మైఖేల్ పాంపియో డిమాండ్ చేశారు. వైమానిక దాడులను అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రతీకార దాడులకు దిగితే ఇరాన్ ఒంటరి అవుతుందనీ అన్నారు. తాను ఇదివరకే ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడానని, ఉగ్రవాదులను అణచివేత చర్యలకే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేసినట్లు తెలిపారు.