భారతీయుడి హత్యేకేసు: అమెరికా మహిళకు 25ఏళ్లు జైలు శిక్ష...!
న్యూయార్క్: న్యూయార్క్లో భారతీయుడి సునందో సేన్ హత్యకేసులో నిందితురాలైన ఎరికా మెనెండెజ్కు క్వీన్స్ సుప్రీం కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో తుది తీర్పుని ఏప్రిల్ 29న వెలువరించనుంది.
2012, డిసెంబర్ 27న న్యూయార్క్ సబ్ వేలో సునందో సేన్ రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎరికా మెనెండెజ్ వెనక నుంచి వచ్చి సబ్ వేలోకి ప్రవేశిస్తున్న రైలు కిందకు నెట్టింది. ఈ ఘటనలో సునందో సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎరికా మెనెండెజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ ఎరికా మెనెండెజ్ పోలీసులకు విచారణలో వెల్లడించింది. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
ఇక సునందో సేన్ హత్య కేసులో నిందితురాలైన ఎరికా మెనెండెజ్ క్వీన్స్లో నివసిస్తున్నారు. 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్లో నివసిస్తున్నాడు. అమెరికాకు వలస వచ్చిన సునందో సేన్, కొలంబియా యూనివర్సిటీ సమీపంలో ఒక ప్రింటింగ్ అండ్ కాపియింగ్ షాప్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు.