కరోనా: ఇండియాకు అమెరికా భారీ సాయం
స్వదేశంలో కరోనా విలయతాండవం చేస్తూ, దాదాపు 10వేల మందిని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అగ్రరాజ్యంగా అమెరికా తన పెద్దమనసు చాటుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతోన్న 64 దేశాలకు మొత్తం 174 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా భారత్ 2.9 మిలియన్ డాలర్లు అందించనుంది. యూఎస్ ఎజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఇండియాలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా వైరస్ నివారణ కోసం ఇండియా పోరాడుతున్న తీరును మెచ్చుకున్న జస్టర్.. అమెరికా అందిస్తోన్న సాయం ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. హెల్త్ సెక్టార్ కు సంబంధించి యూఎస్ఏఐడీ, సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్(సీడీసీ) లాంటి సంస్థలు ఇండియాతో కలిసి పనిచేస్తున్నాయని, గడిచిన 20 ఏళ్లలో అమెరికా నుంచి ఇండియాకు మొత్తంగా 3బిలియన్ డాలర్ల సాయం అందిందని ఆయన గుర్తుచేశారు.
కొన్ని దశాబ్దాలుగా, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రపంచ దేశాలకు అమెరికా చేస్తున్న సాయం ప్రపంచంలోనే అతిపెద్దదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు గతేడాది అమెరికా ఒక్కటే 400 మిలియన్ డాలర్లకుపైగా కాంట్రబ్యూట్ చేసిందని, యూఎన్ రిఫ్యూజీ క్యాంపులకు 1.7బిలియన్ డాలర్లు, యునిసెఫ్ ద్వారా జరుగుతోన్న పిల్లల సంరక్షణా కార్యక్రమాలకు మరో 700మిలియన్ డాలర్లు అమెరికా అందించిన విషయాన్ని కెన్నెత్ జస్టర్ ఈసంద్భంగా గుర్తుచేశారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది వైరస్ బారినపడగా, 70వేల పైచిలుకు మరణాలు సంభవించాయి. అమెరికాలో 3.36లక్షల మందికి ఇన్ఫెక్షన్ కాగా, దాదాపు 10వేల మంది చనిపోయారు. ఇండియాలో ఇప్పటిదాకా 4,389 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయి.