జాగ్రత్త: పారాసిటామాల్ మాత్ర వేసుకుంటే ఆస్తమాకు దగ్గరైనట్టే..!
మీ పిల్లలకు జర్వం వచ్చిందని పారాసిటామాల్ మాత్ర ఇస్తున్నారా..?అయితే జాగ్రత్త... ఇప్పుడు పారాసిటామాల్ ఇస్తే అప్పటి వరకు జ్వరం తగ్గుముఖం పడుతుందేమో కానీ.. దీర్ఘకాలంలో మాత్రం పిల్లలు ఆస్తమా బారిన పడే అవకాశముందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బిడ్డ పుట్టిన రెండేళ్లలో పారాసిటామాల్ మాత్ర వేసుకుంటే వారిలో ఎక్కువ మంది పెరిగే కొద్దీ ఆస్తమా వస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. అదికూడా పిల్లలకు 18 ఏళ్లు వయసు వచ్చేసరికి ఆస్తమా వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పరిశోధకులు చెప్పారు. అయితే ఇది కేవలం ఆస్తమాకు సంబంధించిందే కానీ ఊపిరితిత్తుల సమస్య కాదని స్పష్టం చేశారు.
ఔషధాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో మందుల కొరత తప్పదు
పారాసిటామాల్ మాత్రతో ఆస్తమా
యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ పారసిటామాల్ మాత్ర ఆస్తమాకు ఉన్న సంబంధంపై వివరించింది. గ్లుటాథియోన్ అనే జన్యువులు ఉన్న వారు పారాసిటామాల్ మాత్ర తీసుకుంటే వారిలో ఎక్కువగా ఆస్తమాకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు. సాధారణంగా చిన్నపిల్లలకు తలనొప్పి, కడుపు నొప్పి, చెవి నొప్పి, జలుబు ఉన్న సమయంలో పారాసిటామాల్ ఇస్తారు. ఇది జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. దీని మాతృక కాల్పాల్.
బిడ్డ కడుపులో ఉండగానే అలర్జీ
ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ మెల్బోర్న్ పరిశోధకులు బిడ్డ పుట్టిన సమయం నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు మానిటర్ చేశారు. ఇలా 620 మంది పిల్లలను వీరు పరిశీలించారు. పుట్టకుముందే వారిని తమ పరిశోధనలకు అవసరమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే వారు అలర్జీతో బాధపడుతారని అంచనావేశారు పరిశోధకులు. ఇందుకు కారణం కుటుంబంలో ఒకరైనా అలర్జీతో బాధపడుతున్న వారు ఉండటమేనని అన్నారు.
GSTP1 జన్యువులు ఉన్నవారిలో ఆస్తమా అధికం
పరిశోధకులు పరిశీలిస్తున్న చిన్నపిల్లల ఇంటికి నర్సులు తొలి 15 నెలల వరకు ప్రతి నాలుగు వారాలకోసారి వెళ్లి తమ పిల్లలకు పారాసిటామాల్ ఇచ్చారా లేదా అనే అంశాన్ని ఆరా తీస్తారు. ఇలా బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు ఎంక్వైరీ చేసుకుంటారు. ఇక ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండగానే బ్లడ్ శాంపుల్స్ లేదా సలైవా శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తారు. జన్యుపరమైన వ్యాధులు ఉన్నాయా లేదా పరీక్షిస్తారు. అదే సమయంలో ఆస్తమా ఉందా లేదా అనేది కూడా పరీక్షిస్తారు. GSTP1 జన్యువులు ఉన్నవారిలో ఆస్తమా అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
ఇన్ఫెక్షన్ వల్లే ఆస్తమా అంటున్న ప్రొఫెసర్ నీల్ పీర్స్
ఇదిలా ఉంటే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న నీల్ పీర్స్ వాదన మరోలా ఉంది. చిన్నపిల్లలు పారాసిటామాల్ వినియోగిస్తే వారు ఆస్తమా బారిన పడే అవకాశం ఉందనే వాదన గత 20 ఏళ్లుగా ఉందని అయితే అది రుజువు కాలేదని చెప్పారు. అయితే ఏ చిన్నారులకు ఏ చిన్న జబ్బు చేసిన ముందుగా పారాసిటామాల్ వేస్తారని చెప్పిన నీల్ పీర్స్... పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నందునే పారసిటామాల్ ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ పారాసిటామాల్తో ఆస్తమా రావడం లేదని ఇన్ఫెక్షన్ వల్ల ఆస్తమా వస్తోందన్నారు. ఇన్ఫెక్షన్ నయం చేసేందుకు పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇస్తున్నారని ఇది ఆస్తమాకు మరింత దగ్గర చేరుస్తుందని హెచ్చరించారు.