వాహనాలే ఉగ్రవాదులకు ఆయుధాలు: ఊహించని దాడులతో ప్రాణాలు తీస్తున్నారు
గత కొంత కాలంగా ఉగ్రవాదులు వాహనాలనే తమ ఆయుధాలుగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఊహించని విధంగా సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఉగ్రవా
Recommended Video
వాషింగ్టన్: గత కొంత కాలంగా ఉగ్రవాదులు వాహనాలనే తమ ఆయుధాలుగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఊహించని విధంగా సామాన్య జనాలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఈ దారుణాలకు తెగబడుతున్నారు. అప్పటి వరకు మంచివారిగానే సమాజంలో ఉన్న వ్యక్తులు.. ఒక్కసారిగా ఉగ్రవాదులుగా మారిపోయి ఇలా మారణహోమం సృష్టిస్తుండటం ఆందోళన కలిగించే అంశమే.
ఉబెర్ డ్రైవర్ నుంచి ఉగ్రవాదిగా.. 8మంది ప్రాణాలు తీసిన సైపుల్లా, అంతకుముందు ఇలా..
బ్రిటన్, స్వీడన్, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాలో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు వాహనాలనే ఆయుధాలుగా మార్చుకొని మారణహోమం సృష్టించడం గమనార్హం. తాజాగా అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఉగ్రదాడిలో కూడా వాహనాన్నే ఆయుధంగా చేసుకుని ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.
ఉగ్రవాదులు వాహనాలతో దాడులకు తెబడిన ఘటనలు గమనించినట్లయితే..
మార్చి 22న లండన్లోని వెస్ట్మినిస్టర్ వంతెనపై ఖలీద్ మసూద్ అనే ఐసిస్ ఉగ్రవాది వ్యాన్తో బీభత్సం సృష్టించి ఐదుగురి ప్రాణాలు తీశాడు. బ్రిటన్ పార్లమెంటుకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఏప్రిల్ 7న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఉగ్రవాది ట్రక్తో పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో స్వీడన్కు చెందిన 11ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఉజ్బెకిస్థాన్కు చెందిన రఖ్మత్ అఖిలోవ్ అనే వ్యక్తి దొంగిలించిన ట్రక్తో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
జూన్ 3న లండన్ బ్రిడ్జిపై ఖురామ్ షజాబ్ భట్, రచీద్ రీడౌనే, యూసఫ్ జగ్బా అనే ముగ్గురు ఉగ్రవాదులు వ్యాన్తో పాదచారుల మీదకు దూసుకెళ్లారు. అనంతరం క్షణాల వ్యవధిలోనే వారు కత్తితో వూచకోతకు దిగడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆగస్టు 17న స్పెయిన్లోని బార్సిలోనా రద్దీగా ఉండే లాస్ రాంబ్లాస్ ఏరియాలో ఉగ్రవాది వ్యాన్తో బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.
తాజాగా, మంగళవారం న్యూయార్క్లోని డబ్ల్యూటీసీ వద్ద సైపుల్లా అనే అనుమానిత ఉగ్రవాది ట్రక్కుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో వాహనాలతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో అమెరికాతోపాటు యూరప్ దేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.