నాసా సైన్స్ ఫ్యాక్ట్స్: ఆ గ్రహం పై ఒకప్పుడు నీరు ఉండేది..కానీ ఏమైందో తెలుసా?
నాసా: సౌర వ్యవస్థలోని రెండో గ్రహం శుక్రుడు గురించి కొన్ని ఆసక్తికరమై విషయాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది. శుక్ర గ్రహంపై 2 నుంచి 3 బిలియన్ ఏళ్ల వరకు ద్రవ రూపంలోనే నీరు లభించిందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అయితే 700 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఇది కనుమరుగు అవుతూ వచ్చినట్లు నాసా వెల్లడించింది. నాసా చేపట్టిన పరిశోధనల్లో శుక్ర గ్రహం వాతావరణం గురించి పలు అంశాలు వెలుగు చూశాయి. అయితే అక్కడ జీవించేందుకు ప్రస్తుతం తగిన వాతావరణం లేదని తెలిపింది. అదే కొన్ని బిలియన్ ఏళ్ల క్రితమైతే జీవనం సాధ్యమయ్యేదని పేర్కొంది.
నలభై ఏళ్ల క్రితం చేపట్టిన పరిశోధనల్లో శుక్రగ్రహంపై పెద్ద ఎత్తున నీటి ఆనవాలు ఉండేవంటూ చిన్న హింట్ ఇచ్చింది నాసా. దీన్ని నిర్థారించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. వీరంతా నాసా గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్కు చెందినవారు. మొత్తం ఐదు విభాగాలుగా విభజించి నీటి ఆనవాలపై పరిశోధనలు చేశారు. శుక్రగ్రహంపై మూడు బిలియన్ ఏళ్ల పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీలుగా ఉండేదని చెప్పారు. శుక్ర గ్రహంపై ఉన్న రాళ్లలో నుంచి కార్బన్ డైయాక్సైడ్ విడుదల కాకుండా ఉండి ఉన్నింటే ఈ రోజుకు కూడా అదే ఉష్ణోగ్రతలు అక్కడ ఉండేవని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇప్పటి వరకు తాము ఐదు విభాగాలుగా విభజించి చేసిన పరిశోధనల్లో శుక్ర గ్రహంపై నీటి ఆనవాలు ఉన్నట్లు గమనించామని చెప్పారు. అంతేకాదు సూర్యుడికి దగ్గరగా ఉన్నందువల్ల అక్కడ నీటి ఆనవాలు కనుమరుగైపోయింటాయన్న అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. భూమిపై కంటే రెండింతలు రేడియేషన్ శుక్రగ్రహంపై ఉందని తెలిపారు. శుక్రగ్రహంపై ఉపరితల వాతావరణం ద్రవ రూపంలో నీటికి సహకరిస్తుందనే నమ్ముతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే శుక్రగ్రహంలోని రాళ్ల నుంచి వెలువడిన కార్బన్ డైయాక్సైడ్తో శుక్రుడు ఎలా రూపాంతరం చెందాడో అనేది ఇంకా మిస్టరీగానే ఉందని చెప్పారు.
అక్కడి రాళ్ల నుంచి వెలువడిన కార్బన్ డైయాక్సైడ్ అక్కడి వాతావరణంను కలుషితం చేసిందని అందుకే ఈరోజు శుక్రగ్రహంపై ఉష్ణోగ్రత 462 డిగ్రీలుగా ఉందని తెలిపారు. ఈ విడుదలైన కార్బన్ డైయాక్సైడ్ను అక్కడి రాళ్లు తిరిగి పీల్చుకోలేకపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.