పుల్వామా దాడుల తర్వాత ఇరుదేశాలతో టచ్లో ఉన్నాం: ట్రంప్
Recommended Video
భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారైందని తర్వలోనే ఈ రెండు దేశాల మధ్య ప్రతీకారాలు పోయి శాంతివాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన అధికార యంత్రాంగం రెండు దేశాలతో టచ్లో ఉన్నట్లు అధ్యక్షుడు చెప్పారు.
ఇండియా పాక్ మధ్య పరిస్థితి బాగాలేదు
" ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదకర పరిస్థితికి త్వరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నాం. చాలా మంది జవాన్లు చంపబడ్డారు. ఇలాంటి చర్యలు వెంటనే ఆపివేయాలి. ఇందులో భాగంగానే మేము జోక్యం చేసుకుంటున్నాం. " అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ చెప్పారు. గతవారం పుల్వామా దాడులపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ చెప్పారు. ఈ దాడుల్లో 40 మంది జవాన్లు మృతి చెందారు.
భారత్ మనో నిబ్బరంతో వ్యవహరించింది
"ఇంత పెద్ద ఎత్తున జవాన్లు కోల్పోయినప్పటికీ భారత్ గుండెధైర్యంతో ఉంది. ఆ భాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను." అని ట్రంప్ అన్నారు. అదేసమయంలో రెండు దేశ ప్రభుత్వాలతో తన ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ జరిపిన దాడులతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలా సున్నితంగా మారాయని, రెండు దేశాల అధికారులతో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ట్రంప్ అన్నారు. పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని భవిష్యత్తులో ఆదేశ అధికారులు, నాయకులతో చర్చలు జరుపుతామని ట్రంప్ వెల్లడించారు.
పాక్కు ఆర్థిక సహాయం నిలిపివేశాం..చర్చలు జరుపుతాం
" పాకిస్తాన్కు 1.3 బిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాం. అదే సమయంలో పాకిస్తాన్తో చర్చలు జరుపుతాం. ఇతర అమెరికా అధ్యక్షులు ఉన్న సమయంలో పాకిస్తాన్ రెచ్చిపోయింది. కానీ నా హయాంలో అలా జరగదు. ప్రతి సారి పాకిస్తాన్కు 1.3 బిలియన్ అమెరికా డాలర్లు ఆర్థిక సహాయం చేసేవాళ్లం. కానీ నేను వచ్చాక దాన్ని నిలిపివేశాను. ఎందుకంటే ఉగ్రవాదంపై తమకు పాక్ సహకరించనందున ఆర్థిక ప్యాకేజీని నిలిపివేశాను" అని ట్రంప్ చెప్పారు.