ఎంహెచ్17: రెబల్స్ ఆధీనంలోకి ప్రమాద స్థలి?, ఆందోళన
తోరెజ్(ఉక్రెయిన్): మూడు రోజుల క్రితం క్షిపణి దాడికి గురై తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కుప్పకూలిన మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్-17 విమానంలోని పలువురి మృతదేహాలను రష్యన్ మద్దతుదారులు ఎవరికీ చిక్కకుండా తరలించినట్లు తెలిసింది. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతానికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంకున్నట్లు సమాచారం.
మృతదేహాలను వారి బంధువులు, కుటుంబాలకు అందించేందుకు తాము చేస్తున్న ఏర్పాట్లకు ఉక్రెయిన్ రెబల్స్, రష్యన్ మద్దతుదారులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఇప్పటి వరకు 247 మృతదేహాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
అయితే అక్కడికి అంతర్జాతీయ ప్రతినిధులెవరూ హాజరుకాలేదని తమకు సమాచారం ఉందని పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రతినిధులను బెదిరింపులకు గురి చేస్తోందని రష్యన్ మద్దతుదారులు, ఉక్రెయిన్ రెబల్స్ ఆరోపిస్తున్నారు. కాగా, యూరోపియన్ అధికారులు ఈ వాదనను ఖండించారు.
ఉక్రెయిన్ రెబల్స్ ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను తరలించేందుకు సహకరించాలని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ కోరారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వ సహకారంతో కలిసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రత్యేక బృందాలను ఘటనా స్థలానికి పంపించనున్నట్లు చెప్పారు.