నిజాం ఆస్తులపై యూకే కోర్టు సంచలన తీర్పు.. లండన్ బ్యాంకులోని డబ్బు ఎవరికంటే
హైదరాబాదు ఏడవ నిజాం రాజు, లండన్ బ్యాంకులో 1948లో వేసిన 1 మిలియన్ పౌండ్లు డబ్బులు ఎవరికి చెందుతుందో అనేదానిపై గత కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఇక ఈ వివాదానికి చెక్ పెట్టింది ఇంగ్లండ్ మరియు వేల్స్ హైకోర్టు. ఈ వివాదం ఇటు భారత్ అటు పాకిస్తాన్ల మధ్య నడిచింది. ఎట్టకేలకు తీర్పును వెలువరించింది కోర్టు. ఇంతకీ తీర్పు ఎవరికీ అనుకూలంగా వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సౌదీ రాజు ప్రత్యేక విమానంలో అమెరికాకు పాక్ ప్రధాని ఇమ్రాన్! అక్కడా 'కాశ్మీరే’...
1948లో లండన్ బ్యాంకులో 1 మిలియన్ పౌండ్లు డిపాజిట్
1948లో ఏడవ నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ లండన్ బ్యాంకులో 1 మిలియన్ పౌండ్లు డిపాజిట్ చేశారు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి 35 మిలియన్లకు చేరింది. ఇక ఈ డబ్బులకు అసలైన వారసులం మేమేనంటూ భారత్కు చెందిన నిజాం వారసులు ముఖరంఝా, ముఫఖం ఝాలు ముందుకొచ్చారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఆ డబ్బులు తమకే చెందుతాయని వాదించింది. ఇక దీంతో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. హైదరాబాదును సైనిక చర్య ద్వారా విలీనం చేయాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిన సమయంలో పాకిస్తాన్ నిజాం రాజుకు ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొంటూ పాక్కు ఇచ్చేందుకు ఆ డబ్బులు లండన్ బ్యాంకులో వేశారని పాకిస్తాన్ వాదించింది.
తన పేరుమీద డబ్బులను సురక్షితంగా ఉంచాలంటూ...
ఏడవ నిజాం రాజు లండన్లోని అప్పటి పాకిస్తాన్ అంబాసిడర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లాకు 1 మిలియన్ పౌండ్లు డబ్బులు బదిలీ చేశాడు. డబ్బులను సురక్షితంగా ఉంచాలని చెబుతూ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. తన పేరుపై ఉన్న నిజాం డబ్బులను నమ్మకంతో ఇచ్చినందున దాన్ని సురక్షితంగా కాపాడే బాధ్యత తీసుకుంటానని ఒప్పందం జరిగింది. ఇక ఈ డబ్బులు నేషనల్ వెస్ట్మినిస్టర్ బ్యాంక్ ఆఫ్ లండన్లో ఉంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. డబ్బులు వారసులు తీసుకుందామని వెళితే సాక్ష్యాలు కావాలని బ్యాంకు కోరింది. ఇక అప్పటి నుంచి ఈ డబ్బులు అక్కడే ఉన్నాయి. వడ్డీ పెరుగుతూ వస్తోంది.
పాక్ వాదనలో పసలేదన్న జడ్జి
కొన్ని దశాబ్దాల పాటు అదే బ్యాంకులో మూలిగిన డబ్బులు తాజాగా కోర్టు తీర్పుతో బయటకు రానున్నాయి. కేసును విచారణ చేసిన జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పును వెలువరించారు. ఆపరేషన్ పోలోలో భాగంగా హైదరాబాదును భారత్లోకి విలీనం చేయడం జరిగిందని, ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిజాం రాజు 1965లో లండన్లోని డబ్బులను భారత రాష్ట్రపతికి చెందేలా చూడాలని చెప్పినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి తీర్పును వెలువరించారు. ఇక పాక్ వాదిస్తున్నట్లుగా ఆయుధాలు సప్లై చేసినందుకు గాను డబ్బులు చెల్లిస్తామని నిజాం చెప్పినప్పటికీ అది ఈ డబ్బులే అయి ఉండాల్సిన గ్యారెంటీ లేదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.
నిజాం వారసులకు డబ్బులు చెందేలా చూడాలి
ఇక ఆ డబ్బులు నిజాం వారసులకు చెందుతుందని ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాల్సిందిగా జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ వివాదం జరిగిన సమయంలో నిజాం వారసులు చిన్నపిల్లలుండగా ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లుగా ఉంది. 70 ఏళ్లుగా ఉన్న ఈ డబ్బులు కొన్ని ఆటంకాలు ఎదురు కావడం వల్ల జాప్యం జరిగిందన్నారు నిజాం వారసుల తరపున వాదించిన లాయరు.