వ్యక్తి జేబులో పేలిన ఫోన్, మంటలు, పరుగు(వీడియో)
ఇస్లామాబాద్: ఇప్పటి వరకు మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు సెల్ పోన్లు వేడెక్కి పేలిపోయిన సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా జేబులోని ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. ఇలాంటి ఘటనే పాకిస్థాన్లో చోటు చేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అప్పుడే బస్ దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతని జేబులోని మొబైల్ ఫోన్ బ్యాటరీ నుండి అకస్మాత్తుగా మంటలు వెలువడి చూస్తుండగానే అతన్ని మొత్తం కమ్మేశాయి. దీంతో ఆర్తనాదాలు చేస్తూ అతడు మంటలతోనే రోడ్డుపై పరిగెత్తాడు.
దీంతో అక్కడున్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇంతలోనే స్థానిక మార్కెట్ లోని ఓ వ్యక్తి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి అతనిపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. వెంటనే అతడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరూ, అతని పరిస్థితి ఇప్పుడెలా ఉందని సమాచారం తెలియరాలేదు.