వీడియో వైరల్ : గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే బోయింగ్ విమానంలో మంటలు
Recommended Video
లాజ్ఏంజిలెస్: లాస్ఏంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్ విమానంలోని ఓ ఇంజిన్లో మంటలు వ్యాపించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటన గురువారం జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. గాల్లోకి ఎగరగానే ఇంజిన్ నుంచి మంటల రావడం గ్రౌండ్ సిబ్బంది గమనించి అధికారులను అలర్ట్ చేశారు. గాల్లో వెళుతున్న విమానంలో వెనక భాగంలో మంటలను తాను గమనించినట్లు ఆండ్రూ ఏమ్స్ అనే వ్యక్తి తెలిపాడు.
విమానం గాల్లో ఉన్న సమయంలో మంటలు
గురువారం రోజున స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 11:45 గంటలకు గాల్లోకి ఎగిరిన విమానంలో మంటలు చెలరేగడంతో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందని లాస్ఏంజిలెస్ ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. అయితే విమానంలోని రెండు ఇంజిన్లలోని ఒక ఇంజిన్లో సాంకేతికలోపం తలెత్తడంతోనే మంటలు చెలరేగాయని వివరించారు. మధ్యాహ్న సమయంకల్లా తిరిగి సేఫ్గా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యిందని తెలిపారు.
ప్రమాద సమయంలో విమానంలో 342 మంది ప్రయాణికులు
విమానంలో ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు మొత్తం 342 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు సంయమనం పాటించి విమాన సిబ్బందితో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపింది ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్.
ప్రమాదంపై ఆరా తీస్తున్న బోయింగ్ సంస్థ
ఇదిలా ఉంటే ప్రమాదానికి గల కారణం ఏంటో విశ్లేషిస్తున్నామని బోయింగ్ 777 ఇంజిన్లను తయారు చేసే జనరల్ ఎలక్ట్రిక్ సబ్సిడరీ సంస్థ జీఈ ఏవియేషన్ తెలిపింది. సెప్టెంబర్లో కూడా ఎయిర్ చైనాకు చెందిన బోయింగ్ విమానంలో కూడా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గురువారం జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పిన అధికారులు రెండు ఘటనలు ఒకటే అని ఇప్పుడే చెప్పలేమని చెప్పారు.
8 నెలలుగా ఎగరని బోయింగ్ విమానాలు
రెండు 737 మ్యాక్స్ జెట్లు క్రాష్ అయి మొత్తం 346 మంది మృతి చెందడంతో బోయింగ్ విమానాలపై గట్టి నిఘా పెట్టడం జరిగింది. దాదాపుగా అన్ని బోయింగ్ విమానాలను 8 నెలలకు పైగా నిలిపివేయడం జరిగింది. బోయింగ్ విమానంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి మరమత్తులు చేసేందుకు విమానాలను నిలిపివేయడం జరిగినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది.