Video Viral:ఓ వైపు మహిళ ఏరోబిక్స్.. మరో వైపు సైనిక చర్య: ఏమీ పట్టనట్లుగా..!
మయన్మార్ దేశ పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. దేశం సైనిక పాలనలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంగ్సాన్ సూకీని అరెస్టు చేశారు ఆదేశ సైనికాధికారులు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఏరోబిక్స్ చేస్తున్న సమయంలో ఆమె వెనకాలే మిలటరీ వాహనాలు వెళుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. కానీ ఆ మహిళ తనకేమీ పట్టనట్లుగా ఆమె ఏరోబిక్స్ చేయడంలో లీనమైపోయింది.
మయన్మార్ పార్లమెంట్ ఎదురుగా ఈ యువతి ఏరోబిక్స్ చేస్తోంది. అదే సమయంలో సైనిక చర్యను అమలు చేసేందుకు పలు వాహనాల్లో మిలటరీ వర్గాలు పార్లమెంటు వైపు దూసుకెళుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఏరోబిక్స్ చేసే యువతిని ఖింగ్ హ్నిన్ఇన్ వాయ్గా గుర్తించారు. ఆమె వ్యాయామ టీచర్గా పనిచేస్తోంది. ఖింగ్ ఏరోబిక్స్ చేస్తున్న సమయంలో నల్లటి వాహనాలు పార్లమెంటు వైపు దూసుకెళ్లాయి.అయితే సైనిక చర్య జరుగుతోందన్న విషయం ఖింగ్కు తెలియదు. ఓ ఇండోనేషియన్ పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్లో ఈ నల్లటి వాహనాలు దూసుకొస్తుండగా కొంత దూరంలో ఉన్న సెక్యూరిటీ చెక్ పాయింట్ గేట్లు ఎత్తేందుకు గార్డులు పరుగెత్తడం వీడియోలో కనిపించింది
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగానే కొన్ని మిలియన్ సంఖ్యలో లైక్స్ వచ్చాయి. 2020లో ఇదే అత్యుత్తమ వీడియో అవుతుందని కొందరు నెటిజెన్లు కామెంట్లు సైతం చేశారు. మొత్తం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను తన ఫేస్బుక్ పేజ్ పై ఖింగ్ పోస్టు చేసింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో అంతకు మునుపు చేసిన ఏరోబిక్స్ వీడియోస్ను కూడా ఖింగ్ పోస్టు చేసింది. గత 11 నెలలుగా పార్లమెంటు ఎదురుగా వీడియోలు చేసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఖింగ్.
A woman did her regular aerobics class out in open without realizing that a coup was taking place in #Myanmar. A Military convoy reaching the parliament can be seen behind the woman as she performs aerobics. Incredible! pic.twitter.com/gRnQkMshDe
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 1, 2021
ఇదిలా ఉంటే ఏడాది పాటు మయన్మార్ దేశాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు మిలటరీ వర్గాలు ప్రకటించగానే ఆదేశంలో అలజడి నెలకొంది. స్టేట్ కౌన్సిలర్ సుకీతో పాటు ఇతర ప్రముఖ నాయకులను మిలటరీ అరెస్టు చేసి నిర్బంధించింది. ఈ ఘటనను పలువురు ప్రపంచ దేశాల నాయకులు కూడా ఖండించారు. ఒక ఏడాది పాటు కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాంగ్ నియంత్రణలో దేశం ఉంటుందని మిలటరీ వర్గాలు నిర్వహిస్తున్న టీవీ ఛానెల్స్ కథనంను ప్రసారం చేశాయి. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై మిలటరీ చర్య తప్పడం లేదని కథనాలు ప్రసారం చేశాయి.
Recommended Video