డామ్రే తుపాను బీభత్సం... 49 మంది మృతి
వియత్నాం, మలేసియాలో కుండపోత వానలు, పెను గాలులతో డామ్రే తుపాను సృష్టిస్తోన్న పెను బీభత్సానికి ఇప్పటి వరకు 49 మంది బలయ్యారు. ఈ తుపాను ధాటికి వియత్నాంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా..
హనోయ్: వియత్నాం, మలేసియాలో కుండపోత వానలు, పెను గాలులతో డామ్రే తుపాను సృష్టిస్తోన్న పెను బీభత్సానికి ఇప్పటి వరకు 49 మంది బలయ్యారు. ఈ తుపాను ధాటికి వియత్నాంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మంది గల్లంతయ్యారు.
వియత్నాంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా 40 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మలేసియాలో తుపాను బీభత్సానికి ఐదుగురు మృతిచెందారు.
ఏకధాటిగా 15 గంటలపాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల 12 అడుగుల మేర నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లోని మూడువేల మందికిపైగా ప్రజలను మలేసియా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఆసియా, పసిఫిక్ ఆర్థిక సహకార(ఎపెక్) సదస్సుకు వస్తున్న దేశాధినేతలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ సంభవించిన ప్రకృతి విపత్తుతో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది.