బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ, భారత్ వాదనకు సమర్థన: విజయ్ మాల్యా ఏం చెప్పాడంటే?
లండన్: బ్రిటన్ కోర్టులో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో బ్యాంకులకు సుమారు రూ.9వేల కోట్లు ఎగవేసిన మాల్యా బ్రిటన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మాల్యాను తమకు అఫ్పగించాలని భారత్ కోర్టుకు తెలిపింది.
భారత్ వాదనను బ్రిటన్ కోర్టు సమర్థించింది. పద్నాలుగు రోజుల్లో కోర్టు తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు న్యాయస్థానం అవకాశమిచ్చింది. వెస్ట్ మనిస్టర్ కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నోట్ ఈ తీర్పును ఇచ్చారు. తీర్పు అనంతరం ఈ నిర్ణయం యూకే హోమ్ కార్యాలయంలోని హోమ్ సెక్రటరీకి చేరుకుంది. ఆ తీర్పు ఆధారంగా ఆదేశాలు వస్తాయి.
మాల్యా ఏం చెప్పారంటే?
కోర్టు తీర్పు పైన విజయ్ మాల్యా స్పందించారు. తాను బ్యాంకుల సొమ్ము దోచుకున్నాననే ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించనని చెప్పారు. తాను బ్యాంకుల అసలు మొత్తాన్ని తిరిగి ఇస్తానని చెప్పింది అవాస్తవం కాదు కదా అన్నారు. మాల్యా చాలా రోజులుగా బెయిల్ పైన ఉంటున్నారు. కాగా, కోర్టులో కేసు ఓడిపోతాననే విషయం ముందే తెలిసి చాలా రోజులుగా మాల్యా డబ్బులు చెల్లిస్తానని చెబుతున్నట్లుగా భావిస్తున్నారు.
మాల్యాపై అరుణ్ జైట్లీ స్పందన
విజయ్ మాల్యా పైన బ్రిటన్ కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. ఇది భారత్కు అద్భుతమైన రోజు అని ఆయన తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నారు. యూకే కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎవరూ తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. మాల్యా యూపీఏ ప్రభుత్వం హయాంలో దోచుకున్నారని, ఇప్పుడు ఎన్డీయే హయాంలో వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
స్వాగతించిన సీబీఐ
బ్రిటన్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీబీఐ ప్రతినిధి చెప్పారు. త్వరలోనే కేసును ముగించి విజయ్ మాల్యాను భారత దేశానికి తీసుకు వస్తామని చెప్పారు. ఈ కేసు కోసం సీబీఐ చాలా కష్టపడిందన్నారు. తాము చట్టపరంగా, ఆధారాల పరంగా బలంగా తమ వాదనలు వినిపించామన్నారు. మాల్యా చేసిన నేరానికి శిక్ష అనుభవించాలని కింగ్ ఫిషర్ మాజీ ఉద్యోగిణి చెబుతున్నారు. కేసు అప్పుల చెల్లింపుకు సంబంధించింది మాత్రమే కాదని, ఇందులో మనీలాండరింగ్ వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు.
ఆర్థర్ జైలుకు
కాగా, మాల్యాను భారత్ రప్పించేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లోని జైళ్లపై మాల్యా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బ్రిటన్ కోర్టు అతనిని ఉంచే ఆర్థర్ జైలు వీడియోను పంపించమని చెప్పింది. దీనిని గతంలోనే సమర్పించారు. దీనిపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు మరో అడుగు పడటంతో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు అతనిని తరలిస్తారు. ఇది అత్యంత కట్టుదిట్టమైన జైలు. అతని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన వచ్చాక రక్షణ బాధ్యతలను చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.