విజయ్ మాల్యాకు భారీ షాక్: దివాలా తీసినట్లు ప్రకటించిన యూకే కోర్టు, భారత బ్యాంకులకు ఊరట
లండన్: భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దివాలా తీసినట్లు ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. లండన్ హైకోర్టు చీప్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్టు(ఐసీసీ) జడ్జీ మైఖేల్ బ్రిగ్స్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు మార్గం సుగమమైంది.
మాల్యాపై దివాలా ఉత్తర్వులకు సంబంధించి బ్యాంకుల కన్సార్టియం అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ లాయర్ మార్సియా షెకర్డిమియన్ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు మాల్యా యూకేలో బెయిల్పై ఉన్నారు. అయితే, దివాలా ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ మాల్యా తరపు న్యాయవాది ఫిలిప్ మార్షల్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, మాల్యా బ్యాంకులకు సకాలంలో రుణాలు పూర్తిగా తిరిగి చెల్లిస్తాడని విశ్వసించేందుకు సరైన ఆధారాలు చూపని కారణంగా ఆ పిటిషన్ను జడ్జీ బ్రిగ్స్ తిరస్కరించారు. దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
మాల్యాను భారత్కు అప్పగించేందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తైనట్లు వార్తలు వచ్చిన క్రమంలో మాల్యాను దివాలా తీసినట్లు లండన్ హైకోర్టు కోర్టు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మనదేశంలో సుమారు రూ, 9వేల కోట్లకుపైగా రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టి.. మాల్యా లండన్ పారిపోయిన విషయం తెలిసిందే.