రణరంగంగా వాషింగ్టన్: అల్లర్లలో మృతుల సంఖ్య అంతకంతకూ: రక్షణ బలగాలతో యుద్ధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనతో అట్టుడికిపోతోన్న రాజధాని వాషింగ్టన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతోన్నాయి. వేలాదిమంది డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన అనంతరం నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాషింగ్టన్ వీధులు రణరంగంగా మారాయి. పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్సుల భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.
ఆందోళనకారుల చేతుల్లో మారణాయుధాలు: సెనెటర్లపై దాడులకు కుట్ర: వాషింగ్టన్లో ఎమర్జెన్సీ
పెరుగుతోన్న మృతుల సంఖ్య..
అమెరికా పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్ను ముట్టడించిన ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కాల్పులు జరిపిన ప్రారంభంలో ఒకరు మాత్రమే మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ముగ్గురు తాజాగా మృతి చెందారు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. తీవ్ర రక్తస్రావం, మెడికల్ ఎమర్జెన్సీ వల్లే వారు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
మరింత పెరిగే ప్రమాదం..
గాయపడిన వారిలో మరి కొంతమంది ఆందోళపకారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేపిటల్ బిల్డింగ్పైకి దూసుకొచ్చిన అనంతరం పోలీసులు వారిని అడ్డుకోవడానికి తొలుత స్మోక్ గ్రెనేడ్లను విసిరారు. అప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. వాటిని ఖాతరు చేయకపోవడం వల్ల ఇక నేరుగా ఆందోళనకారుల సమూహంపైకి తుపాకులను ఎక్కు పెట్టారు. ఈ కాల్పుల్లో తొలుత ఒక మహిళ మరణించారు. క్రమంగా ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది. మరింత పెరిగే ప్రమాదమూ ఉన్నట్లు తెలుస్తోంది.
52 మంది అరెస్ట్..
పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన వారిలో ఇప్పటిదాకా 52 మందిని అరెస్ట్ చేశామని వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ రాబర్ట్ జే కొంటీ వెల్లడించారు. మరింత మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ప్రత్యేకించి- కేపిటల్ బిల్డింగ్లోనికి చొచ్చుకెళ్లిన వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనల్లో మారణాయుధాలతో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నామని చెప్పారు. తమకు ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించుకుంటున్నామని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలు పునరుద్దరణ..
మరోవంక- కేపిటల్ బిల్డింగ్లో సమావేశాలు పునఃప్రారంభం అయ్యాయి. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అభ్యంతరాలపై చర్చ సాగుతోంది. ఒక్కో రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్.. జో బిడెన్కు పోలైన ఓట్లు, వాటికి సంబంధించిన లెక్కింపు.. అభ్యంతరాలపై చర్చ నడుస్తోంది. మైక్ పెన్స్.. సెనెటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలను ఉంటే వెల్లడించాలని కోరుతున్నారు. రిపబ్లికన్ సెనెటర్లు మెజారిటీ సంఖ్యలో నిరభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.