ట్విట్టర్, ఫేస్బుక్ ఏరివేత: పర్మినెంట్గా: అలాంటి కంటెంట్ ఉంటే అకౌంట్ క్లోజ్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లోని పార్లమెంట్ భవనంపై భయానక దాడికి పాల్పడిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులపై ట్విట్టర్ యాజమాన్యం కొరడా ఝుళిపిస్తోంది. ఒక్కొక్కరి అకౌంట్ను ఏరి పారేస్తోంది. ఏకంగా దేశాధ్యక్షుడి ఖాతానే శాశ్వతంగా రద్దు చేసి పడేసిన ట్విటర్ మేనేజ్మెంట్.. ఆయన మద్దతుదారులను ఏ మాత్రం ఉపేక్షించట్లేదు. ఇప్పటికే 70 వేలకు పైగా వాషింగ్టన్ ఆందోళనకారుల అకౌంట్ను తొలగించింది. పోస్టులు, హ్యాష్ట్యాగ్ల ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తోంది.
ప్రత్యేకించి- క్వానన్ (QAnon) కంటెంట్ ఉన్న అకౌంట్లపైనే ట్విట్టర్ యాజమాన్యం తన దృష్టిని కేంద్రీకరించింది. డొనాల్డ్్ ట్రంప్ మద్దతుదారుల్లో వేలాదిమంది క్వానన్ ఉద్యమకారులు ఉన్నట్లు గుర్తించింది. వాషింగ్టన్లో నిర్వహించిన ఆందోళనలు, పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్పై దాడికి పాల్పడిన ఘటనలో వారిదే ప్రధాన పాత్రగా నిర్దారించింది. దాడి అనంతరం తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేసిన ఫొటోలు, కామెంట్లు, హ్యాష్ట్యాగ్ల ఆధారంగా క్వానన్ ఉద్యమకారులను కనిపెట్టిన వెంటనే వాటిని బ్లాక్ చేస్తోంది.
క్వానన్ ఉద్యమకారుల కంటెంట్ మొత్తం హింసాత్మక పరిస్థితులు, వ్యవస్థీకృత దాడులను ప్రేరేపించేలా ఉన్నాయనే కారణంతో వాటిని సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికి 70 వేలకు పైగా అకౌంట్లను సస్పెండ్ చేశామని, ఇది ఇక్కడితో ఆగదని తెలిపింది. క్వానన్ కంటెంట్ ఉన్న మరిన్ని అకౌంట్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు- ఫేస్బుక్ సైతం అదే బాటను అనుసరిస్తోంది. స్టాప్ టు స్టీల్.. అనే పేరుతో పోస్ట్ అయిన అన్ని అకౌంట్లను తొలగిస్తున్నామని వెల్లడించింది.
Recommended Video
హింసను ప్రేరేపించేలా ఉండే ఎలాంటి వ్యాఖ్యానాలు, వీడియో క్లిప్పింగులను తాము ప్రోత్సహించబోమని ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. అలాంటి చర్యలు తమ పాలసీకి భిన్నమని స్పష్టం చేసింది. అశాంతియుత వాతావరణానికి కారణం అయ్యే ఎలాంటి కంటెంట్ అయినా ముందస్తు హెచ్చరికలు లేకుండానే తొలగిస్తామని తెలిపింది. ప్రత్యేకించి- వాషింగ్టన్ అల్లర్లు, ఆందోళనకారుల విధ్వంసకాండ అనంతరం.. తమ పాలపీని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.