చైనా దుర్మార్గం... సైన్యంలో బలవంతపు రిక్రూట్మెంట్లు... బోరున ఏడుస్తూ బోర్డర్కు యువ సైనికులు...
రాబోయేది చలికాలం... మరో వారంలో తూర్పు లదాఖ్ ప్రాంతంలో మంచు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.. సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడకపోవడంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని ఉపసంహరించుకోలేదు.. సరికదా అంతకంతకూ అక్కడ తమ సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 30వేల మంది సైన్యాన్ని భారత్ అక్కడ మోహరించింది. చలికాలంలో సైనికులు ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు,జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. మరోవైపు సరిహద్దులో మోహరించేందుకు చైనా కొత్త రిక్రూట్మెంట్లు కూడా చేపట్టడం గమనార్హం.
వుహాన్ ల్యాబ్లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు
బలవంతంగా బోర్డర్కు...
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వెలుగుచూసింది. భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లదాఖ్ ప్రాంతానికి యువ సైనికులను బస్సుల్లో తరలిస్తున్న వీడియో అది. అందులో ఆ యువ సైనికులంతా బోరు బోరుమని విలపిస్తున్నారు. చైనా ప్రభుత్వం తమను బలవంతంగా బోర్డర్కు తరలిస్తున్నందునే వారంతా తీవ్రంగా విలపిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఏడుస్తూనే చైనా ఆర్మీ గీతం 'గ్రీన్ ఫ్లవర్స్ ఇన్ ది ఆర్మీ'ని ఆలపిస్తున్నారు.
అంతా కాలేజీ విద్యార్థులే...
నిజానికి వీళ్లంతా అన్హుయ్ ప్రావిన్స్లోని ఫుయాంగ్ సిటీకి చెందిన కాలేజీ విద్యార్థులుగా తెలుస్తోంది. సరిహద్దులో ప్రస్తుతం భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొత్త రిక్రూట్మెంట్లను చేపట్టిన చైనా... వీరందరిని లదాఖ్ ప్రాంతానికి తరలిస్తోంది. ఫుయాంగ్ సిటీ నుంచి విద్యార్థులతో కూడిన మొత్తం 10 భద్రతా దళాలను బోర్డర్కి తరలించినట్లు తెలుస్తోంది. వీళ్లలో కేవలం ఐదుగురు మాత్రమే టిబెట్లో విధులు నిర్వర్తించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చినట్లు సమాచారం. మిగతావాళ్లను ప్రభుత్వం బలవంతంగా అక్కడికి తరలిస్తోంది.
ఇలా వెలుగులోకి...
పాకిస్తాన్ కమెడియన్ జైద్ హమీద్ సెప్టెంబర్ 20న ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతకుముందు వి చాట్ సోషల్ మీడియాలో దీని ఒరిజినల్ వీడియోని ఎవరో షేర్ చేశారు. ఈ వీడియోపై ఓ చైనీస్ నెటిజన్ స్పందిస్తూ.. 'వాళ్లందరినీ బోర్డర్కు తరలిస్తున్నట్లు చెప్పారు. అందుకే వాళ్లలా ఏడుస్తున్నారు...' అని పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మాత్రం ఎక్కడా అందుబాటులో లేదు. ఉన్న ఈ కొద్దిపాటి సమాచారాన్ని తైవాన్ న్యూస్ బయటపెట్టింది. సరిహద్దులో భారత్ను ఎదుర్కొనేందుకు చైనా ఇలా బలవంతపు రిక్రూట్మెంట్ల చేయడం చర్చనీయాంశంగా మారింది.
కొనసాగుతున్న బలగాల మోహరింపు...
ఈ ఏడాది జూన్ 15న లదాఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. చైనా వైపు కూడా ప్రాణ నష్టం భారీగానే జరిగినప్పటికీ డ్రాగన్ ఇప్పటికీ ఆ లెక్కలను బయటపెట్టలేదు. ఈ ఘటన తర్వాత సరిహద్దులో ఉద్రిక్తతల తగ్గింపు,వాస్తవాధీన రేఖ నుంచి సైన్యం ఉపసంహరణకు వరుస చర్చలు జరుపుతున్నా అవేవీ సఫలం అవట్లేదు. పైగా ఓవైపు చర్చలు జరుగుతుండగానే చైనా తన దుందుడుకు చర్యలతో భారత్ను కవ్వించే ప్రయత్నాలు మానుకోలేదు. ఈ క్రమంలోనే చైనాకు ధీటుగా భారత్ కూడా సరిహద్దులో బలగాల మోహరింపు,ఆయుధాల తరలింపును చేపట్టింది.