చైనాలో మరో వైరస్: ఏడుగురు మృతి, 60 మందికిపైగా అస్వస్థత, కీటకాల ద్వారా వ్యాప్తి
బీజింగ్: ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణాలు సంభవించాయి. ఇంకా ఆ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇది ఇలావుండగా, చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త వైరస్ కారణంగా ఆ దేశంలో ఏడుగురు మృతి చెందారు.
మరో 60 మందికిపైగా ఆ వైరస్ బారినపడి అనారోగ్యానికి గురయ్యారు. టిక్ కాటు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తోందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
తూర్పు చైనాలోని జియాంగ్ ప్రావిన్స్లో గత ఆరు నెలల్లో సుమారు 37 మంది ఈ ఎస్ఎఫ్టీఎస్ వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత అదే వైరస్ తూర్పు చైనాలోని అన్ హుయి ప్రావిన్స్లో 23 మందికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జియాంగ్ సు రాజధాని నాన్ జియాంగ్కు చెందిన ఓ మహిళకు ఈ ఎస్ఎఫ్టీఎస్ వైరస్ సోకింది. ఆమెకు జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించాయి.
అంతేగాక, ఆమె శరీరంలో ల్యూకోసైట్, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినట్లు వైద్యం అందించిన డాక్టర్లు తెలిపారు. కాగా, నెల రోజుల చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. ఇప్పటి వరకు చైనాలోని అన్ హుయి, జియాంగ్ సు ప్రావిన్స్ లో ఈ వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు.
ఎస్ఎఫ్టీఎస్ అనేది కొత్త వైరస్ కాదట.. 2011లోనూ చైనాలో దీని ప్రభావం ఉందట. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కీటకాలు కుట్టడం ద్వారా కూడా ఈ వైరస్ సోకుందని తెలిపారు. ముఖ్యంగా టిక్ కాటు వల్ల ఎక్కువగా వ్యాపిస్తోందని చెప్పారు. అయితే, ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.