నివ్వెరపోయే నిజం: విటమిన్ 'డి' సప్లిమెంట్స్తో ఉపయోగం లేదట
ఉదయాన్నే కాస్త ఎండలో నిలబడు... సూర్యకిరణాలు శరీరం తాకితే విటమిన్ డీ వస్తుంది. దీంతో శరీరంలోని ఎముకలు బలపడతాయని పెద్దలు చెబుతుంటారు. ఇది ఒక రకంగా నిజమే. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉన్న వారికి వైద్యులు విటమిన్ డీ మాత్రలు ఇస్తారు. కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుందో చెప్పేందుకు ఓ పరిశోధన చేశారు కొందరు శాస్త్రవేత్తలు. వీరు కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
సప్లిమెంట్స్తో ఎలాంటి ఉపయోగం లేదు
మీరు ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా..? అందుకోసం విటమిన్ డీ మాత్రలు వాడుతున్నారా.. అయితే అవి పేరుకే మాత్రలు కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీపై ఇప్పటి వరకు 81 పరిశోధనలు బయటకొచ్చాయి. వాటిని తిరిగి స్టడీ చేయడంతో పాటు కొత్త విషయాలు పరిశోధకులు వెల్లడించారు. విటమిన్ డీ సప్లిమెంట్లు శరీరంలోని ఎముకలకు చాలా తక్కువగా మేలుచేస్తాయని వారు వెల్లడించారు.
రికెట్స్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు
విటమిన్ డీ తీసుకోవడంతో ముఖ్యంగా రికెట్స్ ,ఆస్టియోమాలేసియా జబ్బులను నిలువరించగలుగుతాయని అయితే ఇవి ఎవరికైతే వారి శరీరంపై తక్కువ సూర్యకాంతి పడుతుందో అలాంటి వారికి మాత్రమే కొంత వరకు పనిచేస్తాయని పరిశోధకులు చెప్పారు. విటమిన్ డీ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడవని, లేదా విరిగిన ఎముకలు తిరిగి అతుక్కోవని లేదా ఎముకల్లోని మినిరల్స్ శాతం పెరగదని చెబుతున్నారు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మార్క్ బొల్లాండ్. తక్కువ శాతంలో తీసుకున్నా పనిచేయవు లేదా ఎక్కువ డోస్లో తీసుకున్నా పనిచేయవని చెప్పారు. అయితే దీనిని మరికొంతమంది పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. విటమిన్ డీ తక్కువగా ఉన్న అతికొద్ది మంది వ్యక్తులపైనే పరిశోధనలు జరిగాయని అది కూడా వారు మాత్రలు వాడకముందు ప్రయోగాలు చేశారని చెప్పారు.
తక్కువ ట్రయల్స్తో ఫలితాలు సరిగ్గా రావు
విటమిన్ డీ లోపంతో ఉన్న అతితక్కువ మందిపై ఎక్స్పెరిమెంట్ జరిగిందని అదికూడా విటమిన్ డీ చాలా తక్కువ మోతాదులో ఇచ్చారని చికిత్సకు తగిన సమయం తీసుకోకుండానే ఫలితాలు విశ్లేషించారని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్లార్క్ తెలిపారు. అయితే విటమిన్ డీ పై ఇంకా ఐదు ట్రయల్స్ నిర్వహిస్తున్నామని చెప్పిన డాక్టర్ క్లార్క్ ఇందులో 57వేల మంది యువతీ యువకులు ఉన్నారని చెప్పారు. ఈ ట్రయల్స్ నిర్వహించాకే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇది వచ్చే ఏడాది కల్లా పూర్తవుతాయని డాక్టర్ క్లార్క్ వెల్లడించారు.