వాన్నక్రై ఫెయిల్యూర్: క్యాష్ చేసుకుంది ఎంతో తెలిస్తే షాక్!..
బ్యాకప్ ఫైళ్లకు అవకాశం లేని వ్యక్తులు, చిన్న వ్యాపారస్తులే ఎక్కువగా వాన్నక్రై బారిన పడటంతో.. వారి నుంచి ఆశించినంత స్థాయిలో డబ్బు ముట్టలేదని సమాచారం.
లండన్: వాన్నక్రై రాన్సమ్ వేర్.. ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడించిన ఈ వైరస్ ను అంత సులువుగా ఎవరు మరిచిపోలేరు. అనేక దేశాల్లో కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను హ్యాక్ చేసిన ఈ సైబర్ నేరస్తులు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఇంత పెద్ద సైబర్ దాడి చేసినా.. వారి ఖాతాలోకి చేరిన డబ్బు మాత్రం తక్కువ మొత్తమే కావడం గమనార్హం.
ఇప్పటివరకు కేవలం 82వేల డాలర్లు(భారత కరెన్సీలో రూ.52.85లక్షలు) మాత్రమే సైబర్ నేరస్తుల ఖాతాలో చేరాయట. ప్రస్తుతం ఈ సైబర్ నేరస్తులను పట్టుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామని నేర పరిశోధన అధికారులు చెబుతున్నారు.
కాగా, గతంలో జరిగిన కిప్టోవాల్ సైబర్ దాడిలో నేరస్తులు 32.2కోట్లను ఆర్జించారు. కంప్యూటర్లలోకి వైరస్ ను ప్రవేశపెట్టడం ద్వారా ఫైళ్లన్నింటిని తమ నియంత్రణలో ఉంచుకుని, అడిగినంత డబ్బు చెల్లిస్తేనే రహస్య ఎన్ క్రిప్షన్ కీ విడుదల చేస్తున్నారు నేరస్తులు. బ్యాకప్ ఫైళ్లకు అవకాశం లేని వ్యక్తులు, చిన్న వ్యాపారస్తులే ఎక్కువగా వాన్నక్రై బారిన పడటంతో.. వారి నుంచి ఆశించినంత స్థాయిలో డబ్బు ముట్టలేదని సమాచారం.
బ్రిటన్ లోని జాతీయ ఆరోగ్య స్కీమ్ కు సంబంధించి పలు ఆసుపత్రుల నెట్ వర్క్ ను హ్యాక్ చేసినా.. బ్యాకప్ ఫైళ్లతో తమకు పనిలేదని నిర్వాహకులు తేల్చేయడంతో.. సైబర్ నేరస్తులకు పెద్దగా డబ్బు చేరలేదు. డబ్బులు ఎక్కడి నుంచి ఎలా నేరస్తులకు చేరుతున్నాయనే విషయాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. కచ్చితంగా నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.