ఇరాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ద మేఘాలు..! అగ్రరాజ్యం డ్రోన్ ను కూల్చివేసిన ఇరాన్..!!
బాగ్దాద్/హైదరాబాద్: ఇరాన్ అమెరికా మద్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకూ ఇరాన్ స్థావరాలపై అడదడపా దాడులు నిర్వహించిన అమెరికా ఇప్పుడు ఇరాన్ చేతిలో భంగపడింది. ఇరువేశాల మద్య యుద్ద వాతావరణం కమ్ముకొస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన డ్రోన్ ను కూల్చి వేశామని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్.క్యూ-4 గ్లోబల్ హాక్ నిఘా డ్రోన్ ఈ ఉదయం తమ గగనతలంలోకి ప్రవేశించిందని... హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లో ఎగిరిందని ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. తమ రివల్యూషనరీ గార్డ్స్ సిబ్బంది ఆ డ్రోన్ ను కూల్చి వేశారని వెల్లడించింది.
అయితే, దీనికి సంబంధించిన ఫొటోలను కానీ, వీడియోలను కానీ విడుదల చేయలేదు. అయితే డ్రోన్ కూల్చివేత వార్తలను అమెరికా ఖండించింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ ప్రవేశించలేదని ఆయన అమెరికా వార్త సంస్థకు తెలిపారు. గత ఏడాది కాలం నుంచి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ తప్పుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. గతంలో కూడా అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసింది. అంతేకాదు, దాని శకలాలను ప్రదర్శించి అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.