ఫుట్బాల్ మ్యాచ్ ఎఫెక్ట్: ఒక్క గోల్ కొట్టడంతో ఆ దేశ ప్రభుత్వం కూలిపోయింది
నెల రోజుల పాటు సాకర్ వరల్డ్ కప్ ప్రపంచాన్ని ఊపేసింది. చివరి ఘట్టంలో ఫ్రాన్స్ ఫుట్బాల్ జగజ్జేతగా నిలిచింది. ఫుట్ బాల్ క్రీడ ప్రపంచదేశాలతో అంతగా మమేకమైపోయింది. అంతేకాదు దేశ ప్రభుత్వాలను కూల్చగల సత్తా కూడా ఉందని ఈ క్రీడ నిరూపించింది. తాజాగా హైతీ ప్రభుత్వం కూలిపోయింది. ఇందుకు కారణం ఫుట్ బాల్ క్రీడేనట. ఎందుకో చూద్దాం...
హైతీ దేశం అంతర్జాతీయంగా ఎలాంటి విజయాలు నమోదు చేయలేదు. అందులో ఆదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు కానీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కానీ పెద్దగా కనిపించరు. ఇందుకోసం ఆదేశ ప్రజలు అంతర్జాతీయ వేదికలపై బ్రెజిల్ తమ అనధికార దేశంగా భావిస్తారు. ఇదే హైతీ ప్రభుత్వం ఆ దేశ ప్రధాని జాక్ గై లఫాన్టంట్ కొంప ముంచింది. సాకర్ వరల్డ్ కప్లో భాగంగా బ్రెజిల్, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో బ్రెజిల్ బెల్జియం చేతిలో 2-1 గోల్స్ తేడాతో పరాభవం మూటగట్టుకుని ఇంటిదారి పట్టింది. ఇక ఈ ప్రభావం హైతీ దేశ ప్రజలపై పడింది. ఓటమిని జీర్ణించుకోలేని వారు రోడ్లపైకొచ్చి నానా రభస చేశారు. అల్లర్లు సృష్టించారు. శాంతి భద్రతలు అదుపుతప్పడంతో ఆ దేశ ప్రధాని జాక్ గై లఫాన్టంట్ రాజీనామా చేశారు.
ఇక అంతకంటే ముందే హైతీలో ప్రజలు కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఇంధన ధరలపై ఇస్తూ వస్తున్న సబ్సీడీని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉందంటూ ప్రచారం జరగడంతో హైతీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇక బ్రెజిల్ బెల్జియం దేశాల మధ్య ఫుట్బాల్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ మరో పదినిమిషాల్లో మొదలవుతుంది అనగా... హైతీ ప్రభుత్వం ఇంధన ధరలపై సబ్సీడీ ఇవ్వడం ఎత్తివేస్తున్నామంటూ ప్రకటన చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అదే సమయంలో బెల్జియం మిడ్ ఫీల్డర్ కెవిన్ డె బ్రూఇన్ కొట్టిన గోల్ను నిలువరించడంలో బ్రెజిల్ గోల్ కీపర్ విఫలమవడంతో ఆ మ్యాచ్ బ్రెజిల్ ఓడిపోయింది. ఈ ఓటమి కూడా అక్కడి ప్రజలను చాలా నిరాశకు గురిచేయడంతో ఆ బాధను తమ నిరసన కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు.
రహదారులపైకి ఆందోళనకారులు వచ్చి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నిప్పు పెట్టారు. నానా రభస చేశారు. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతేకాదు అక్కడ దుకాణాల్లోకి చొరబడి ఇదే అదనుగా లూటీలకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన వారిని చంపేశారు కొందరు అభిమానులు. ఈ ఘర్షణలో మొత్తం ఏడు మంది చనిపోగా... చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకవేళ బ్రెజిల్ మ్యాచ్ గెలిచిఉంటే ఇంత జరిగేది కాదని కొందరు ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఇక అల్లర్లు ఎంతకీ తగ్గకపోవడంతో హైతీ ప్రధాని జాక్ గై లఫాన్టంట్ ఆ దేశాధ్యక్షుడికి తన రాజీనామా సమర్పించారు. లఫాన్టంట్ రాజీనామాను అధ్యక్షుడు జొవెనెల్ మోసీ ఆమోదించారు.
చూశారుగా... మొత్తానికి ఒకే ఒక గోల్ ఒక దేశ ప్రధాని పదవికి ఎసరు పెట్టింది. అంత క్రేజ్ ఈ ఫుట్బాల్ గేమ్కు ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.