ముగ్గురు భార్యలతో 35మంది పిల్లలు: సెంచరీ చేస్తానని వైద్యుడు(వీడియో)
ఇస్లామాబాద్: ప్రపంచంలో చాలా దేశాలు జనాభాను తగ్గించుకోవాలని చెబుతున్నాయి. మరికొన్ని దేశాలు ఆయా దేశాల జనాభాను పెంచాలని కోరుతున్నాయి. కాగా, ఓ పాకిస్థాన్ వైద్యుడు తనకు దేనీతోనూ సంబంధం లేదన్నట్లుగా.. సంతానం పెంచేందుకు తనకు ఓ భారీ టార్గెట్ ఉందని చెబుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్లోని బెలుచిస్థాన్ రాష్ట్రానికి చెందిన 43 ఏళ్ళ ఓ డాక్టర్ ఇప్పటికే 35 మంది పిల్లలకి జన్మనిచ్చి తండ్రయ్యాడు. అంతటితో జాన్ తృప్తి పడలేదు. వంద మంది పిల్లల్ని కని ప్రపంచ రికార్డు సాధించేంతవరకు విశ్రమించనని చెబుతున్నాడు.
పాకిస్థాన్లోని క్వెట్టాకి చెందిన జాన్ మహ్మద్కు ముగ్గురు భార్యలు, 21 మంది కుమార్తెలు, 14 మంది కుమారులు ఉన్నారు. గత వారం ఇతని రెండో, మూడో భార్యలు ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో తాను 35 మంది పిల్లలకు తండ్రినయ్యానంటూ తెగ మురిసిపోతున్నాడు.
కాగా, జాన్ వైద్యంతో పాటు చిన్నచిన్నవ్యాపారాలు కూడా చేస్తున్నాడు. దీంతో ఏం ఇబ్బందులు లేకుండా పిల్లల ఖర్చులు వెళ్లిపోతున్నాయని జాన్ ఇటీవల ఓ పాక్ మీడియా ద్వారా ఈ విషయాలను వెల్లడించాడు.
కుటుంబ ఖర్చుల కోసం ప్రతి నెల ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నానని తెలిపాడు. తాను మంచి పేరున్న డాక్టర్నని, అలాగే చిన్నవ్యాపారం కూడా ఉందని పేర్కొన్నాడు. జాన్ సెంచరీ పూర్తి చేస్తాడో లేదో వేచిచూడాలి మరి. కాగా, ప్రస్తుతం జాన్.. తన పిల్లలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.