మోడీ ఇంగ్లీష్పై ట్రంప్ సరదా వ్యాఖ్యలు: ఆ తర్వాత ఏం జరిగిందంటే..(వీడియో)
ప్యారిస్: జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించిన అనంతరం ఈ దేశాధినేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంగ్లీష్పై సరదా వ్యాఖ్యలు చేశారు.
మోడీ ఇంగ్లీష్ అద్భుతం..
నరేంద్ర మోడీ ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలరని, అయినా ఆ భాషలో మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆ గదిలో ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా నవ్వేశారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ, ట్రంప్లు కరచాలనం చేసుకుంటూ నవ్వులు చిందించారు.
నవ్వులే.. నవ్వులు.. మోడీ కూడా..
‘మనం మొదట చర్చించుకోవాలి. ఆ తర్వాతే మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలి' అని నరేంద్ర మోడీ హిందీలో వ్యాఖ్యానించారు. వెంటనే అందుకున్న ట్రంప్.. మోడీ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరని.. కానీ ఆయనకు ఆ భాషలో మాట్లాడటమే ఇష్టముండదని అన్నారు. దీంతో ఆ గదిలో నవ్వులు విరబూశాయి. ట్రంప్ చేయిపై చరుస్తూ మరీ మోడీ నవ్వేశారు.
భారత్ దౌత్య విజయం
నిన్న మొన్నటి వరకు కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ చెప్పుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్.. మోడీతో భేటీ అనంతరం కాశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశంపై ఎలాంటి వివాదాలున్నా.. భారత్, పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్-పాకిస్థాన్ల మధ్య మూడోపక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయడంతో.. ట్రంప్ కూడా అందుకు అంగీకరించారు.
మోడీపై నమ్మకం ఉంది..
కాశ్మీర్ అంశంపై మోడీ, తాను సుదీర్ఘంగా చర్చించుకున్నామని, అక్కడ పరిస్థితి అదుపులో ఉందని మోడీ చెప్పారని ట్రంప్ తెలిపారు. పాక్తోమాట్లాడి ఇరుదేశాలకు మంచి జరిగేలా ఏదో ఒకటి చేస్తారనే నమ్మకం మోడీపై తనకు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోడీ, ఇమ్రాన్ ఖాన్లతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, వారు ఇరుదేశాల మధ్య సమస్యను పరిష్కరించుకోగలరని అన్నారు. భారత్-పాక్ తమ మధ్య ఉన్న సమస్యలను చర్చించుకుని ద్వైపాక్షికంగా అన్ని సమస్యలనూ పరిష్కరించుకోగలవని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో దేశ జోక్యం అవసరం లేదని, ఎవరిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని తేల్చి చెప్పారు.
జీ7 దేశాలకు పిలుపు..
అంతేగాక, 1947కు ముందు రెండు దేశాలు కలిసే ఉండేవని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తాను ఫోన్ చేసి అభినందనలు తెలిపానని, ఇరు దేశాలు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మంచి ఫలితాలు రాబట్టాలని, పేదరికం, నిరక్షరాస్యతపై పోరాటం చేయాలని పిలుపునిచ్చినట్లు మోడీ తెలిపారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత్లో సామాజిక అసమానతల నిర్మూలనకు ఉపయోగిస్తున్నట్లు మోడీ తెలిపారు. ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణపై జీ-7 దేశాలకు మోడీ కీలక సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.