ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం నీటి కాలుష్యమే కారణం: ప్రపంచబ్యాంకు నివేదిక
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోతోందంటే అందుకు కారణం నీటి కాలుష్యమే అని ఓ నివేదికలో తెలిపింది ప్రపంచబ్యాంకు. చాలా దేశాల్లో ఆర్థికవృద్ధి మూడోవంతుకు పడిపోవడం కారణం నీరు కలుషితం కావడమే అని పేర్కొంది. ప్రపంచదేశాల్లోని నీటి వనరులపై పరిశోధనలు చేశామని చెప్పిన ప్రపంచబ్యాంకు ఇందుకోసం శాటిలైట్ డేటాను వినియోగించామని పేర్కొంది.
పరిశుభ్రమైన నీటితోనే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు, కలుషితమైన నీటితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని తద్వారా ఆర్థిక వృద్ధికి నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. నీటి కలుషితం కావడంతో ఆహార ఉత్పత్తి తగ్గిపోతోందని, పేదరికం పెరిగిపోతోందని నివేదిక వెల్లడించింది. నీటి కాలుష్యం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వ్యవసాయం చేయలేకపోవడంతో పర్యావరణంకు కూడా నష్టం వాటిల్లుతోందని నివేదిక వెల్లడించింది. దీనివల్ల దేశాల మధ్య వాణిజ్యం కూడా కుంటున పడిందని పేర్కొంది.
నీటి నాణ్యతకు పెద్ద దెబ్బగా నైట్రోజన్ మారిందని నివేదిక వెల్లడించింది. నైట్రోజన్ నదులను, సముద్రాలను కలుషితం చేస్తోందని, గాల్లో అది నైట్రస్ ఆక్సైడ్లా మారి గ్రీన్ హౌజ్ గ్యాస్ విడుదల చేస్తోందని పేర్కొంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో నైట్రేట్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది. పిల్లల ఎదుగుదలపై అది ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. ఇక మనిషి చేసే పొరపాట్లకు వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయని నివేదిక వెల్లడించింది. ప్రతి ఏటా ఉప్పునీటి వల్ల ఆహారం ఉత్పత్తి తగ్గిపోతోందని... దీంతో 170 మిలియన్ మందికి ఆహారం అందడం లేదని పేర్కొంది. అంటే బంగ్లాదేశ్ జనాభా ఎంతుందో అంతమందికి ఆహారం అందకుండా పోతోందని నివేదిక స్పష్టం చేసింది.
ఇక దీనికి చెక్ పెట్టాలంటే మూడు పద్ధతులను ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. ముందుగా నీటి వనరులపై అవగాహన కార్యక్రమాలను పెంచాలని పేర్కొంది. నీటి కాలుష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుని నీటి వనరులకు నష్టం వాటిల్లకుండా చూడాలని ప్రపంచ బ్యాంకు నివేదిక సూచించింది.