భారత్ అనుకున్నది చేసింది: షరీఫ్కు పాక్ మీడియా హెచ్చరిక
కరాచీ: పాక్లో ప్రభుత్వానికి, మీడియాకు మధ్య నడుస్తున్న యుద్ధం ఉధృతమైంది. పాక్ ప్రభుత్వ, భద్రతా బలగాల గొంతుకగా ది నేషన్ పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన విరుచుకు పడింది. అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అవుతున్నా మనకు కించిత్ బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు ప్రతిగా పాకిస్తాన్ను భారత్ ఏం చేయాలనుకుందో ఆ పనిని (అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిని) చేసిందన్నారు. దానిని అడ్డుకోవడంలో పాక్ అడుగడుగునా విఫలమవుతోందని నిప్పులు చెరిగింది. యూరి ఉగ్రదాడి అనంతరం పాక్ పట్ల దృక్పథాన్ని పూర్తిగా మార్చుకున్న భారత్.. కొద్ది గంటల కిందట గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులోను పాక్ ఉగ్రవాదాన్ని తల్లిలా పెంచి పోషిస్తోందని విమర్శించిందని పేర్కొంది.
అంతకుముందు సార్క్ సమావేశాన్ని బహిష్కరించిందని, మరో ఏడు దక్షిణాసియా దేశాలు భారత్ను సమర్థిస్తూ మనకు దూరమయ్యాయని పేర్కొంది. పాక్ను భారత్ ఏకాకిని చేసిందని, ఇలాంటి పరిస్థితిల్లో మనం విధానాలను మార్చుకోవాలని హితవు పలికింది. ప్రపంచంలో మనల్ని భారత్ ఏకాకిని చేసిందని హెచ్చరికించింది.