మాతో వద్దు.. యుద్ధం వస్తే మేం సిద్ధం: భారత్కు పాక్ హెచ్చరిక, లోకసభ ఎన్నికలు.. ఎవరికి లాభం!
ఇస్లామాబాద్: పుల్వామా తీవ్రాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ను భారత్ వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతోంది. అంతర్జాతీయస్థాయిలో ఏకాకిని చేయడం మొదలు.. నీటి విడుదల వరకు షాక్ ఇస్తోంది. పాక్పై యుద్ధానికి దిగవచ్చుననే వాదనలు వినిపిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం యుద్ధం కంటే పాక్ను ప్లాన్తో ఇరుకున పెట్టే దిశగా ముందుకు సాగుతోంది.
మరోవైపు, పాకిస్తాన్ మాత్రం యుద్ధం వస్తే తాము సిద్ధమని పదేపదే ప్రకటనలు చేస్తోంది. తాజాగా, శుక్రవారం పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ భారత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్లోని పుల్వామా దాడితో పాక్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ దాడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమను నిందిస్తోందన్నారు. ఈ పద్ధతిని తాము అంగీకరించమని చెప్పారు.
యుద్ధంపై భారత్ సంకేతాలు పంపిస్తోంది
కాశ్మీర్లో ఉగ్రవాద దాడితో తమకు ఒరిగేది ఏమీ లేదని పాక్ మేజర్ జనరల్ గఫూర్ చెప్పాడు. తమకూ బలమైన సైన్యముందని, యుద్ధం వస్తే కనుక దీటుగా సమాధానమిచ్చే సత్తా తమకు ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరగాలని తాము కోరుకోవడం లేదని, భారత్ ప్రభుత్వమే ఆ మేరకు సంకేతాలు పంపుతోందని, ఏమీ ఆలోచించకుండా, ఏ ఆధారాలు లేకుండా తమను నిందించడం సరికాదని, ఇప్పుడు తాము మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, ఎలాంటి హెచ్చరికలకైనా తాము ధీటుగా సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు.
లోకసభ ఎన్నికలు... ఎవరికి లాభమో ఆలోచించండి
1998 న్యూక్లియర్ ప్రయోగం తర్వాత పాకిస్తాన్లో ఉగ్ర కార్యకలాపాలకు తమ దేశం కేంద్రంగా మారిందని భారత్ చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని పాక్ మేజర్ జనరల్ గఫూర్ అన్నాడు. పాకిస్థాన్లో ఏదైనా ముఖ్య కార్యక్రమం జరుగుతున్నా లేక తమ దేశం స్థిరంగా ముందుకు సాగుతున్న సమయంలో భారత్లో ఏదో ఒక అలజడి చెలరేగుతుందని, ఇక్కడ జరగుతున్న అభివృద్ధి, విదేశీ ప్రతినిధుల పర్యటనలు, పెట్టుబడులను భారత్ చూసి ఓర్చుకోదని, చైనా, రష్యా, అమెరికా దేశాలు తమతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని, భారత్లో కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికల దృష్ట్యా పుల్వామా దాడిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
మాతో పెట్టుకోవద్దు
పుల్వామా దాడితో పాకిస్థాన్కు ఏ ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ దాడి వల్ల ఎవరికి లాభమో మీరే (భారత్) ఆలోచించుకోవాలని చెప్పాడు. యుద్ధం చేయాల్సి వస్తే తాము సిద్ధమని, తమతో పెట్టుకోవద్దని హెచ్చరించాడు. తాము యుద్ధానికి సిద్ధం కావడం లేదని, మీరే అలాంటి సంకేతాలు పంపిస్తున్నారన్నాడు. 1998లో న్యూక్లియర్ టెస్టుల తర్వాత, 2008లో ముంబై దాడుల తర్వాత కూడా భారత్ తమపై ఆరోపణలు చేసిందని చెప్పాడు. కానీ తమ పాత్ర లేదన్నాడు. కానీ తీవ్రవాదాన్ని ఎవరు మద్దతిస్తున్నారో కులభూషణ్ ఉదాహరణ అన్నాడు.
భారత్కు గట్టి సమాధానమివ్వండి.. ఇమ్రాన్ ఆదేశాలు
మరోవైపు, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ శుక్రవారం జాతీయ భద్రతా మండలి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచనలు చేశారు. భారత ప్రభుత్వం ఏదైనా చర్యలకు దిగితే అందుకు దీటుగా జవాబివ్వాలన్నారు.