ఇక సంబరాలే... విజయంపై ట్రంప్ ప్రకటన... ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం కోర్టుకు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కానే లేదు... అప్పుడే అధ్యక్షుడు ట్రంప్ తమదే విజయమని ప్రకటించేశారు. ఒక పెద్ద వేడుక జరుపుకునేందుకు మనమంతా సిద్దంగా ఉన్నామని అమెరికా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.'నాకు మద్దతునిచ్చిన అమెరికా ప్రజలందరికీ ధన్యవాదాలు.. విచారకరమేంటంటే కొన్ని గ్రూప్స్ ఓట్లను తస్కరించే ప్రయత్నం చేస్తున్నాయి.' అని ట్రంప్ పేర్కొన్నారు. తామే విజేతలమని ప్రకటించుకున్నప్పటికీ... ఆయన ముఖంలో మాత్రం ఆ జోష్ కనిపించలేదు.
Recommended Video
'ఈ స్థాయిలో ఓటింగ్ ఒక రికార్డు... టెక్సాస్లో మనం 7లక్షల ఓట్లతో గెలిచాం. జార్జియా,అరిజోనా,కరోలినాలను కైవసం చేసుకున్నాం. పెన్సిల్వేనియాలోనూ గెలవబోతున్నాం. నిజం.. మనం అధ్యక్ష ఎన్నికలను గెలిచేశాం...' అని ట్రంప్ ప్రకటించారు. మొదటి నుంచి ఎన్నికల్లో అవకతవకలపై ఆరోపణలు చేస్తూ వస్తున్న ట్రంప్... తాజాగా అదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు లేవనెత్తిన ఆయన దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
'మేము సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నాం. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయకపోవడం అమెరికన్ ప్రజలను మోసం చేయడమే. నిజం చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మేము గెలిచేశాం. ఓటింగ్,కౌంటింగ్ రెండింటినీ ఇక నిలిపివేయాలి.' అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తామే విజేతలమని ప్రకటించినప్పకీ... ట్రంప్ ముఖంలో మాత్రం ఆ జోష్ కనిపించకపోవడం గమనార్హం.
కాగా,కరోనా కారణంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య పెరిగింది. వీటి లెక్కింపుకు సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో ఎక్కువమంది పోస్టల్ బ్యాలెట్కు మొగ్గుచూపడంతో... ఆ కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం(నవంబర్ 7) వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగితే అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు.