ఆర్టికల్ 370 రద్దుపై తన వైఖరేంటో తేల్చేసిన జో బిడెన్ ప్రభుత్వం: మయన్మార్ హింసపై ఫైర్
వాషింగ్టన్: జమ్మూ కాశ్మీర్ను ప్రత్యేక హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్నిరెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో అగ్రరాజ్యం అమెరికా.. తన పాత విధానాలు, వైఖరినే అనుసరించాలని నిర్ణయించుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఏళ్ల తరబడి నలుగుతూ వస్తోన్న కాశ్మీర్ సమస్యపై అమెరికా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా బదలాయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
అమెరికాలో కొత్తగా ఏర్పడిన జో బిడెన్ ప్రభుత్వం.. కాశ్మీర్పై ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనే ఉత్కంఠతకు నెడ్ ప్రైస్ తెర దించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా బదలాయిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..జమ్మూ కాశ్మీర్ను ఆర్థికంగా బలోపేతం చేయదగ్గదేనని అన్నారు. ఆర్థిక, రాజకీయ సుస్థిరతకు కారణమౌతుందని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు చర్యలు కాశ్మీర్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాయని చెప్పారు.
భారత్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తోనూ అదే రకమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని నెడ్ ప్రైస్ స్పష్టం చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వంతో కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చకోవడం, దౌత్యపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మయన్మార్లో చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ శాంతియుతంగా ప్రదర్శలను నిర్వహిస్తోన్న ప్రజలపై అక్కడి సైనిక ప్రభుత్వం దౌర్జన్యానికి దిగడాన్ని సహించబోమని, అన్నారు.