భారత్-పాక్ ఉద్రిక్తత: మధ్యవర్తిత్వానికి మేం రెడీ
ముంబై: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించడానికి తాము చొరవ తీసుకుంటామని సౌదీ అరేబియా వెల్లడించింది. భారత్, పాక్ తమకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలని, ఈ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడం తమకు కూడా అవసరమేనని ఆ దేశం అభిప్రాయం పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని సౌదీ అరేబియా ఇంధనశాఖ మంత్రి ఖలిద్ అల్ ఫలీహ తెలిపారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా వివాహానికి ఆయన హాజరయ్యారు. మూడు వారాల వ్యవధిలో ఆయన భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత ఉపఖండంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి ఈ రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉగ్రవాదం, కాశ్మీర్ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ విషయాల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం నెలకొని ఉందని, దీన్ని తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఖలిద్ తెలిపారు. వాటిని పరిష్కరించడానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. సౌదీ అరేబియాలో నివసించే ప్రతి పౌరుడు కూడా దీన్నే కోరుకుంటున్నారని అన్నారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదిల్ అల్ జుబేర్ కూడా కొద్దిరోజుల కిందట ఇదే తరహా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కిందటి నెలలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్, భారత్ లో పర్యటించారు.