కరోనా: అమెరికాకు బుద్ధిచెప్పిన ఇండియా.. ట్రంప్కు ఘాటుగా బదులు.. ‘క్లోరోక్విన్’పై కీలక ఉత్తర్వులు
కొవిడ్-19 చికిత్సకు బాగా పనిచేస్తుండటంతో యాంటీ మలేరియా డ్రగ్ 'హైడ్రాక్సీ క్లోరోక్విన్', 'పారాసిటమాల్'కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు డ్రగ్స్ తయారీలో పేటెంట్స్ పొందడంతోపాటు, తయారీలోనూ ముందున్న ఇండియాపైనే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి.
ఈలోపే తనకు మాత్రం స్పెషల్ ప్రివిలేజ్ కావాలని.. వెంటనే 'హైడ్రాక్సీ క్లోరోక్విన్' ను సరఫరా చేయకుంటే ప్రతీకారం తప్పదని తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ప్రపంచమంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కంటున్నవేళ.. ఒకరికొకరం అండగా నిలబడాలేతప్ప.. చీప్ పాలిటిక్స్ సరికాదని ట్రంప్ కు భారత ప్రభుత్వం గట్టిగా గడ్డిపెట్టింది. ఆ రెండు డ్రగ్స్ పై మోదీ సర్కార్ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
20 దేశాల చూపు భారత్ వైపు..
ప్రపంచమంతటా కరోనా విలయం కొనసాగుతుండగా.. ఇప్పుడు దేశాలన్నీ భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్', ‘పారాసిటమాల్' డ్రగ్ ను సరఫరా చేయండంటూ అభ్యర్థిస్తున్నాయి. ఆ జాబితాలో అగ్రరాజ్యం యూఎస్ తోపాటు యూరప్, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20కిపైగా దేశాలున్నాయి. ఈ దేశాలన్నీ మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మొదటివారం మధ్యలో ఆర్డర్స్ పంపాయి. అయితే అప్పటికే భారత ప్రభుత్వం, ముందుచూపుతో ఆ రెండు డ్రగ్స్ ఎగుమతులపై నిషేధం విధించింది. వినతులు వెల్లువలా వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
గ్రీన్ సిగ్నల్..
దాదాపు అన్ని దేశాలూ కొవిడ్-19 చికిత్స కోసం ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్', ‘పారాసిటమాల్' వాడుతున్నందున, మానవతా దృక్పథంతో ఆ రెండు డ్రగ్స్ ఎగుమతులపై కొనసాగుతోన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మంగళవారం మీడియాకు వెల్లడించారు. విపత్తు సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఒకటిగా పనిచేయాలన్నది భారత్ అభిమతమని, అంతర్జాతీయ సమాజానికి అవసరమైన సహకారం అందించడంలో ఏనాడూ వెనుకడుగు వేయలేదని, మానవతా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు డ్రగ్స్ సరఫరా పునరుద్ధరిస్తామని శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే..
ముందు పొరుగు దేశాలకే..
‘‘నిజానికి స్పెషల్ ఎకానమీ జోన్స్(ఎస్ఈజెడ్)లో ఉత్పత్తి అయ్యేవాటిపై నిషేధాలు విధించడం కుదరదు. కానీ కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసకుంది. ఎందుకంటే, ఏ దేశమైనా ముందు తన ప్రజలను కాపాడుకోవడానికే ప్రయిరిటీ ఇస్తుంది. కచ్చితంగా ఇండియా కూడా దేశీయ అవసరాలకు సరిపడా ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్', ‘పారాసిటమాల్' నిల్వలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎగుమతులకు అంగీకరారం తెలిపింది. అందరికంటే ముందు, ఇండియానే నమ్ముకున్న పొరుగుదేశాలకు మందుల్ని సరఫరా చేస్తాం. ఆ తర్వాత కొవిడ్-19తో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన ఇతర దేశాలకు పంపుతాం'' అని శ్రీవాస్తవ క్లారిటీ ఇచ్చారు.
ట్రంప్ బెదిరింపులపై ఘాటుగా..
ప్రస్తుత వివపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలూ పరస్పర సహకారంతో ముందుకెళ్లాలే తప్ప.. అనవసర రాజకీయాలు చేయాలనుకోవడం ఏమాత్రం సరికాదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను ఉద్దేశించి శ్రీవాస్తవ అన్నారు. ఇప్పటి వాతావరణంలో ఇంతకు మించి భారత ప్రభుత్వం ఏమీ అనదల్చుకోలేదని, పొరుగుదేశాల అవసరాలు తీర్చిన వెంటనే, మిగతా దేశాలకు కూడా మందులు సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
నోరుపారేసుకుని..
కొవిడ్-19 వ్యాధికి నివారణోపాయంగా యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్' వాడాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. కానీ కొవిడ్-19కు ఆ డ్రగ్ వాడటంపై అమెరికాలో ఇంకా పరిశోధనలు పూర్తికాలేదు. దీంతో ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతున్నాయి. మూడు వేల మంది కొవిడ్-19 పేషెంట్లు.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లినికల్ టెస్టులకు అంగీకరించారని వైస్ ప్రెసిడెంట్ పేన్స్ వెల్లడించారు. సోమవారం వైట్ హౌజ్ లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ‘‘మొన్న ఆదివారమే భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై బ్యాన్ ఎత్తేయాలని కోరానని. కానీ ఇప్పటిదాకా ప్రతిస్పందన రాలేదు. ఒకవేళ డ్రగ్స్ సరఫరా చేయకుంటే దానికి ప్రతీకారం తీర్చుకుంటాం''అని నోరుపారేసుకున్నారు.
అక్కడింకా ఆగమాగం..
కరోనా కాటుకు అమెరికాలో కనీసం 2 లక్షల మంది చనిపోతారన్న అంచనాల నడుమ, మరణాలకు మానసికంగా సిద్ధం కావాలని ప్రెసిడెంట్ ట్రంప్ అనడం, అమెరికన్ల జీవితాలకు సంబంధించి ఇది చాలా కష్టతరమైన, విచారకరమైన వారం కాబోతున్నదని ఆదేశ సర్జన్ జనరల్ జెరోమీ ఆడమ్స్ చెప్పడం అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. మంగళవారం ఉదయం నాటికి అమెరికాలో మొత్తం 3.67లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో దాదాపు 11వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 20వేల మంది మాత్రమే వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 10 వేల మంది క్రిటికల్ కండిషన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. ట్రంప్ ఒక ప్రెసిడెంట్ లాగా కాకుండా ఫక్తు వ్యాపారవేత్తలా వ్యవహరించినందుకే అమెరికాలో ఈ దుస్థితి నెలకొందని బిల్ గేట్స్ లాంటి ప్రముఖులందరూ విమర్శిస్తున్నారు.