కాశ్మీర్ను లాక్కుంటాం: జిన్నా సమాధి వద్ద భుట్టో
కరాచీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) యువ నేత బిలావల్ భుట్టో కశ్మీర్పై మరోసారి రెచ్చిపోయారు. ఆరు నూరైనా భారత్ నుంచి కాశ్మీర్ను సాధించి తీరతానని మహ్మద్ ఆలీ జిన్నా సమాధి దగ్గర జరిగిన ఒక ర్యాలీలో శపథం చేశారు. ‘నేను కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినపుడల్లా భారతదేశమంతా గగ్గోలు పెడుతుంది. ఒక భుట్టో మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలో వారికి తెలియదు. అందుకే ఆ గగ్గోలు' అని అన్నారు.
మళ్లీ అదే నోటితో కాశ్మీర్లో తాను శాంతినే కోరుకుంటున్నట్టు చెప్పారు బిలావల్ భుట్టో. కాశ్మీర్పై తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. కాశ్మీర్ ముమ్మాటికీ పాకిస్థాన్లో భాగమవుతుందంటూనే కాశ్మీర్ పేరుతో భారత-పాక్ చర్చలను బందీగా చేసేందుకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వం, మీడియాపైనా ఆయన విమర్శలు చేశారు. పీపీపీ ప్రతిష్ఠను మంటగలిపి, నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పాకిస్థాన్ భవిష్యత్ నేతగా ఎదిగేందుకు తన తాత జుల్ఫీకర్ ఆలీ భుట్టోలా, బిలావల్ కూడా కాశ్మీర్నే నిచ్చెనగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. జుల్ఫీకర్ ఆలీ భుట్టో కూడా కశ్మీర్ కోసం భారత్తో వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమని చెప్పేవారు. బిలావల్ కూడా అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టు కనిపిస్తోంది.
కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూనే ఉన్న పాక్
పాకిస్థాన్ బరితెగింపు కొనసాగుతూనే ఉంది. భారత సరిహద్దుల్లో పాక్ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద బోర్డర్ అవుట్పోస్టులపై కాల్పులు జరిపాయని జమ్మూ జిల్లా మేజిస్ర్టేట్ అజిత్కుమార్ సాహు తెలిపారు.