నేతాజీ చివరి రోజు గడిచిందిలా!: వెబ్సైట్లో వివరాలు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 1945 ఆగస్టు 18వ తేదీన తాను ప్రయాణిస్తున్న విమానం తైవాన్లో కూలినందువల్లే మరణించారనేది ఇప్పటి వరకూ కొనసాగుతున్న వాదన. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది ఆయన మనవడు, స్వతంత్ర పాత్రికేయుడైన ఆశిష్ రే విడుదల చేసిన తాజా పత్రాలు దీన్ని దాదాపు ధ్రువీకరిస్తున్నాయి.
ఈ మేరకు నేతాజీ చివరి రోజుల సమాచార పత్రాలను తాను ఏర్పాటు చేసిన వెబ్సైట్ www.bosefiles.infoలో అందరికీ అందుబాటులో ఉంచారు. ఈ డాక్యుమెంట్స్లోని వివరాల ప్రకారం 1945 ఆగస్టు 17న నేతాజీ తన బృందంతో బ్యాంకాక్ నుంచి విమానంలో మధ్యాహ్నం వేళకు వియత్నాంలోని సైగాన్ (ప్రస్తుతం హోచిమిన్ సిటీ) చేరుకున్నారు.
నిజానికి నేతాజీ ఈశాన్య ఆసియా వెళ్లాల్సి ఉంది. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓ రెండు రోజుల ముందు లొంగిపోవడంతో అక్కడి వెళ్లే వీలులేక నేతాజీ బృందం సైగాన్లో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేతాజీ నాయకత్వంలోగల భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ), జపాన్కు మధ్యవర్తిగా ఉన్న ‘హికరి కికన్' సంస్థకు చెందిన జనరల్ ఇసోదా ఆయనతో మాట్లాడారు.
టోక్యో వెళుతున్న 14 సీట్ల జపాన్ యుద్ధ విమానంలో రెండు సీట్లున్నాయని, తమతో రావచ్చునని నేతాజీని కోరినట్లు అందులో తెలిపారు. తప్పనిసరి కావడంతో కల్నల్ రహ్మన్తో కలిసి నేతాజీ బయలుదేరారు. అయితే, తనతోపాటు చైనాలోని మంచూరియా రావాలని లెఫ్టినెంట్ జనరల్ షిదెయ్ సూచించగా ఆయన అంగీకరించారు.
అయితే విమానం ఆలస్యంగా బయల్దేరడంతో పైలట్ సూచనమేరకు తౌరేన్లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతానికి నేతాజీ మనవడు తన వెబ్సైట్ వెల్లడించిన వివరాలివి. నేతాజీ మరణం మిస్టరీపై 1956లో మేజర్ జరనల్ షా నవాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు.
ఆ తర్వాత నేతాజీ మరణం మిస్టరీపై ఐఎన్ఏ చీఫ్గా మేజర్ జనరల్ భోస్లే బ్రిటిష్ మిలిటరీ ఇంటిలిజెన్స్ను సైతం విచారించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ విచారణలో ఆగస్టు 17, 1945 ఉదయం నేతాజీ బ్యాంక్ నుంచి సైగాన్ వెళ్లినట్లు వెల్లడైంది. నేతాజీ మరణించడంపై వాస్తవాలను తదుపరి పత్రాల్లో వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు.