కాన్సాస్ ఘటనను నుంచి తేరుకోకముందే మరో హత్య
కాన్సాస్ ఘటనను మరిచిపోక ముందే అమెరికాలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు.
లాంకస్టర్: కాన్సాస్ ఘటన నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాన్సాస్లో జరిగిన కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన వారం రోజులు దాటింది. ఈ స్థితిలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల లాంకస్టర్లో భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు. అతని ఇంటి బయట ఈ దారుణం చోటు చేసుకుంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతుడిని 43 ఏళ్ల హర్నీష్ పటేల్గా గుర్తించారు. పటేల్ రాత్రి 11.24 గంటలకు తన స్టోర్ను మూసేసి టయోటా మినీవ్యాన్లో ఇంటికి బయలుదేరాడని పోలీసులు చెప్పారు. అతను స్పీడీ మార్ట్ అనేదాన్ని నడుపుతున్నాడు.
అతనికి భార్య, ఓ బిడ్డ ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు క్లూస్ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు.