జూపిటర్ మిషన్ సక్సెస్: నాసా రికార్డు
న్యూయార్క్: సౌరకుటుంబంలోని అతిపెద్ద గ్రహం జూపిటర్(బృహస్పతి) రహస్యాలను ఛేదించేందుకు నాసా చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఐదేళ్ల కిందట నాసా పంపిన జునో స్పేస్క్రాఫ్ట్ బృహస్పతి రేడియేషన్ను తట్టుకొని విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఈ విషయాన్ని నాసా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
జూనో జూపిటర్ ఆర్బిట్లోకి చేరగానే శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. జూపిటర్ దగ్గరికి వెళ్లగానే జునో తన రాకెట్ ఇంజిన్ను ప్రారంభించి తన వేగాన్ని తగ్గించుకుంది. తర్వాత మెల్లగా కక్ష్యలోకి చేరింది. స్పేస్క్రాఫ్ట్ కక్ష్యలోకి చేరేముందు దాని కెమెరా, ఇతర పరికరాలను ఆఫ్ చేశారు. దీంతో ప్రస్తుతానికి ఎలాంటి ఫొటోలు అందుబాటులో లేవు.
20 నెలల పాటు జూపిటర్కు సంబంధించిన అరుదైన విశేషాలను భూమికి చేరవేయనుంది జూనో. ఈ ప్రాజెక్ట్ కోసం నాసా 110 కోట్ల డాలర్ల ఖర్చు పెట్టింది. భూమి, అంగారక గ్రహాలకు భిన్నంగా గురుగ్రహం పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. సౌరకుటుంబంలో సూర్యుని తర్వాత మొదట ఏర్పడిన గ్రహంగా జూపిటర్కు పేరుంది.
అందుకే ఈ గ్రహాన్ని అధ్యయనం చేస్తే భూమితోపాటు మిగతా సౌరకుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1989లో గెలీలియో తర్వాత జూపిటర్ కక్ష్యలో చేరిన రెండో స్పేస్క్రాఫ్ట్ జూనో.
గతంలో పదేళ్లపాటు జూపిటర్ చుట్టూ తిరిగిన గెలీలియో.. దాని ఉపగ్రహం యురోపాపై సముద్ర జాడలను కనిపెట్టింది. జునో 20 నెలల తర్వాత 2018లో జూపిటర్ వాతావరణంలోకి వెళ్లిపోయి తననుతాను విచ్ఛిన్నం చేసుకుంటుంది.