‘లక్కీ బాయ్’ వాట్ ఏ మూమెంట్: ప్రపంచ శక్తివంతమైన దేశాధినేతలతో బాలుడి సెల్ఫీ
హూస్టన్: హోడీ మోడీ కార్యక్రమం వేలాది మంది భారతీయ అమెరికన్ల మధ్య ఆదివారం ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రసంగాలతో ఈ కార్యక్రమాన్ని హోరెత్తించారు.
ప్రపంచ శక్తివంతమైన దేశాధినేతలతో..
అయితే, హౌడీ మోడీ కార్యక్రమంలో ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. హోడీ మోడీ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కళాకారులను మోడీ, ట్రంప్ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఓ బాలుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలకు అధినేతలైన మోడీ, ట్రంప్లతో సెల్ఫీ కావాలని కోరాడు. ఇందుకు ట్రంప్ ఓకే చెప్పి మోడీతో కలిసి ఆ బాలుడితో సెల్ఫీ దిగారు.
భుజం తట్టిన మోడీ..
ఆ బాలుడితో ఎంతో ఆనందంగా ఈ దేశాధినేతలు సెల్ఫీకి ఫొజిచ్చారు. ఆ తర్వాత బాలుడి భుజాన్ని తట్టి నరేంద్ర మోడీ అభినందించారు. ట్రంప్ కూడా నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.
లక్కీ బాయ్..
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రెండు గంటల్లోనే 19వేల మంది యూజర్లు లైక్స్ కొట్టారు. ప్రపంచంలోనే శక్తివంతమైన నేతలతో ఆ బాలుడు సెల్ఫీ దిగాడంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. లక్కీ బాయ్ అంటూ మరికొందరు పొగిడేస్తున్నారు. జీవితానికి సరిపోయే సెల్ఫీని తీసుకున్నాడంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ఇలా..
కాగా, ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. ఈ వీడియోలో ఓ మంచి ఫొటో ఉంది గమనించారా? అని వ్యాఖ్యానించారు. మనమంతా ఎలా కలిసున్నామో చూడండి అంటూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. +