భూమికి సూర్యుడే పెనుముప్పు! సౌర పవనాలతో బలహీనమవుతున్న భూఅయస్కాంత క్షేత్రం!?
వాషింగ్టన్: భూమిపై మనం నిశ్చింతగా మనుగడ సాగిస్తున్నామంటే.. అందుకు కారణం భూమి చుట్టూరా ఉండే అయస్కాంత క్షేత్రమే. భగభగ మండే సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన సౌరపవనాలు, రేణువుల ప్రభావం భూమిపై పడకుండా అడ్డుకుంటున్నది కూడా భూఅయస్కాంత క్షేత్రమే!
చరిత్ర సృష్టించిన 'స్పేస్ ఎక్స్'! అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అంగారకుడి వద్దకు కారు!
అయితే ఇప్పుడు ఈ భూఅయస్కాంత క్షేత్రానికే పెద్ద ముప్పు వచ్చిపడింది. క్రమేణా ఈ భూఅయస్కాంత క్షేత్రం దెబ్బతింటోందట.. బలహీనపడుతోందట. ఈ పరిణామం ఇలాగే కొనసాగి ఏదో ఒకనాడు భూమికి ఒక రక్షణ వలయంలా ఉన్న ఈ అయస్కాంత క్షేత్రమే గనుక మాయమైతే.. భూమ్మీద నివసిస్తున్న మన పని అయిపోయినట్లే!
చంద్రయాన్-2 ఈ ఏడాదే: చంద్రుడిపైకి తొలిసారిగా 'ఇస్రో' రోవర్, 14 రోజులపాటు పరిశోధన!
సూర్యుడి కారణంగానే భూమి మటాష్!
సూర్యుడే మనకు జీవనాధారం. కానీ సూర్యుడి వల్లే మనకు అపకారం. అవును, ఏదో ఒక రోజు సూర్యుడి వల్లే మన భూమి, ఈ భూమ్మీద మానవజాతి తుడిచిపెట్టుకుపోతుంది. సూర్యుడి ఉపరితలం నుంచి వెలువడే, అత్యధిక రేడియేషన్తో కూడిన సౌరపవనాల వల్లే ఏదో ఒకరోజు భూమికి మూడుతుంది. ఈ సౌరపవనాలు మన భూమిని అతలాకుతలం చేయబోతున్నాయి. సౌర పవనాల ధాటికి భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం దెబ్బతింటోందని, భూ అయస్కాంత క్షేత్ర ధ్రువాలు ఆకస్మికంగా కదులుతూ తలకిందులవుతున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదిలాగే కొనసాగితే ఏదో ఒకరోజు మన భూమి భస్మీపటలం అవడం ఖాయం.
ఆ ధ్రువాలు, ఈ ధ్రువాలు వేర్వేరు...
భూమిపై ఉండే ఉత్తర, దక్షిణ ధ్రువాలు వేరు, భూఆయస్కాంత క్షేత్రంలోని ధ్రువాలు వేరు. ఈ అయస్కాంత క్షేతం మన కళ్లకు కనిపించదు కానీ, దిక్సూచి ద్వారా మాత్రమే ఉత్తర, దక్షిణ ధ్రువాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇందులోనూ కాస్త తేడా ఉంది. వాస్తవ ధ్రువాలకు, ఈ భూ అయస్కాంత క్షేత్రంలోని ధ్రువాలకు మధ్య 11 డిగ్రీల తేడా ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమి తిరుగుతుండడం వల్ల కాల క్రమేణా ఈ ధ్రువాల మధ్య అంతరం పెరుగుతోందట. 19వ శతాబ్దం మొదట్లో ఉన్న ఉత్తర ధ్రువానికి, ఇప్పుడు వాస్తవంగా ఉన్న ఉత్తర ధ్రువానికి మధ్య 600 మైళ్ల దూరం ఉందట. ఈ దూరం ఏటా 40 మైళ్లు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తల అంచనా.
అసలేమిటీ ఆయస్కాంత క్షేత్రం?
బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం.. విశ్వంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం నుంచే మన సౌర కుటుంబం, ఆ క్రమంలో ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమి ఏర్పడ్డాయి. తొలుత మన భూమి కూడా సూర్యుడు మాదిరిగానే భగభగ మండుతూ ఉండేది. ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాలకు చల్లబడి, గట్టిపడి.. ఆపైన మళ్లీ కొన్ని కోట్ల సంవత్సరాలకు ఈ భూమ్మీద జీవం అనేది ఆవిర్భవించి.. నేడు మానవాళి ఈ భూమిపై ఇలా జీవిస్తోంది. ఈ క్రమంలో భూమి చుట్టూరా ఒక ఆయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడింది. అదే ఇన్నాళ్లూ మన భూమిని కాపాడుతోంది. అయితే రానురానూ ఈ భూఆయస్కాంత క్షేత్రంలో పలుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కారణం సూర్యుడి నుంచి అత్యంత తీవ్రతతో కూడిన సౌరపవనాలు భూఆయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపించడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూ ఆయస్కాంత క్షేత్రం దెబ్బతింటే...
సూర్యుడి నుంచి ధాటిగా వెలువడే సౌర పవనాలు భూమిని నేరుగా ఢీకొని అతలాకుతలం చేస్తాయి. అంతరిక్షంలోని మన ఉపగ్రహ వ్యవస్థను కూడా సౌర పవనాల నుంచి వెలువడే రేడియేషన్ కకావికలం చేస్తుంది. భూమిపై విద్యుత్ ఉండదు.. అంతా గాఢాంధకారం అలుముకుంటుంది. రేడియేషన్ వల్ల మనుషులకి రకరకాల క్యాన్సర్లు వస్తాయి. డీఎన్ఏ వ్యవస్థ ఛిద్రమవుతుంది. మనుషులు కదల్లేని స్థితికి వస్తారు చివరకు వ్యాధులు, బాధలతో మానవాళి అచిరకాలంలోనే అంతమవుతుంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, ఇదంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మనకు సమీపంలో ఉండే అరుణగ్రహంపై జరిగిందని, అందుకే భూమిలాంటి వాతావరణమే ఉన్నప్పటికీ, అక్కడ నీరు, జీవం జాడలు లేకుండా పోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి అంతరించి పోనుందా?
ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి భవిష్యత్తులో అంతరించిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు బల్లగుద్దిమరీ వాదిస్తున్నారు. అయితే ఇదంతా ఇప్పట్లో జరగకపోవచ్చని, ఇలా జరగడానికి కనీసం మరో వెయ్యి ఏళ్లు అయినా పడుతుందని కొలరాడో విశ్వవిద్యాలయ స్పేస్ ఫిజిక్స్ ల్యాబ్ డైరెక్టర్ డేనియల్ బేకర్ చెబుతున్నారు. ‘భూమి మధ్య భాగమైన కోర్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూమి మధ్యభాగంలో ధ్రవరూపంలో ఉన్న ఇనుముకు, భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రానికి సంబంధం ఉంది. తాజా పరిశోధనల సారాంశం ఏమిటంటే... భూ అయస్కాంత క్షేత్రంలోని ధ్రువాలు ఆకస్మికంగా కదులుతూ తలకిందులవుతున్నాయి. ఇది నిజమేనని, ఇలా జరుగుతోందని అత్యంత ఆధునికమైన మానిటరింగ్ పరికరాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఇదిగనుక నిజమే అయితే, ఏదో ఒక రోజు భూ అయస్కాంత క్షేత్రమే కుప్పకూలిపోతుంది. అయితే ఇది తక్షణం జరగకపోవచ్చు.. ఓ వెయ్యేళ్లు పట్టినా జరుగుతున్న మార్పు మాత్రం నిజం..' అని ఆయన చెబుతున్నారు.
భూఅయస్కాంత క్షేత్రమే కీలకం...
సూర్యుడి నుంచి ప్రసరించే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడకుండా వాతావరణంలోని ఓజోన్ పొర ఎలాగైతే మానవాళిని కాపాడుతుందో, అదే మాదరిగా భూమి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం కూడా భూమిని రక్షిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ భూఅయస్కాంతక్షేత్రం అంతమయినా, కనీసం అది బలహీనపడినా.. దానివల్ల కలిగే విపరిణామాలు మాత్రం అత్యంత దారుణంగా ఉంటాయి. భూఅయస్కాంత క్షేత్రం పూర్తిగా అంతరించిపోనక్కర్లేదు.. అందులో కనీసం 10% మార్పు జరిగినా సూర్యుడి ప్రతాపం మహా ఉధృతంగా ఉంటుందట. భూగ్రహం తట్టుకోలేనంత తీవ్రంగా ఉంటుందట. విశేషమేమంటే ఈ భూఅయస్కాంత క్షేత్రం దెబ్బతినడం, బలహీనపడడం అనేవి గతంలో కూడా జరిగాయట. ‘పురాతన కాలం నాటి శిలలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తొలుత ఊహించిన దానికంటే పది రెట్లు వేగంగా భూఅయస్కాంత క్షేత్రం బలహీనపడుతోంది. దశాబ్దానికి 5% చొప్పున క్షీణిస్తోంది.. ముఖ్యంగా దక్షిణ అమెరికా ఎగువన ఇది మరీ వేగంగా కుచించుకుపోతోంది..' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.