అభినందన్ అప్పగింతలో రెడ్ క్రాస్ పాత్ర .. పాక్, భారత్ ఎందుకు వైద్య పరీక్షలు చేయలేదు ?
న్యూఢిల్లీ : ఎట్టకేలకు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ స్వదేశానికి చేరారు. వాఘా సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ .. భారత వాయుసేన ఉన్నతాధికారులు అప్పగించింది. ఓ యుద్ధ ఖైదీని సొంత దేశానికి అందజేసేప్పుడు ఉన్న నిబంధనలు ఏంటీ ? దాయాది దేశాలు కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించింది ? ఖైదీని అప్పగించే సమయంలో ఇంకా ఏ నిబంధనలు ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. యుద్ధ ఖైదీని అప్పగించే సమయంలో ఉన్న నియమాలు, నిబంధనలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
నిబంధనలు, నియమాలు
సాధారణంగా ఒక దేశ సైనికుడి యుద్ధ ఖైదీగా పట్టుబడితే ఆయా దేశాల ఒప్పందాల మేరకు అప్పగించాల్సి ఉంటుంది. భారత్, పాకిస్థాన్ విషయంలో జెనీవా ఒప్పందం ఉంది. దీని ప్రకారం పట్టుబడిన యుద్ధఖైదీని వారంరోజుల్లో అప్పగించకుంటే యుద్ధం ప్రారంభించినట్టే లెక్క. ఈ నియమం ప్రకారం పాకిస్థాన్ భారత్ కు అభినందన్ ను అప్పగించింది. ఆ తర్వాత వాఘా సరిహద్దులో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ప్రత్యక్షమయ్యారు. దీంతో రెడ్ క్రాస్ సొసైటీ విధుల నిర్వహణపై చర్చ మొదలైంది.
మధ్యేమార్గమా ?
సాధారణంగా పట్టుబడిన దేశం వైద్య పరీక్షలు జరిపినా .. లేదంటే సొంత దేశం హెల్త్ చెకప్ చేసినా తర్వాత సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మాత్రమే హెల్త్ చెకప్ చేస్తారు. కానీ దీనికి ఓ చరిత్రే ఉంది.
ఎలా మొదలైంది ?
1859లో వ్యాపారవేత్త జీన్ హెన్రీ డ్యూనంట్ వ్యాపారం కోసం లావర్డి నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఫ్రాన్స్, ఆస్ట్రియా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రథమ చికిత్స లేక వేలాదిమంది చనిపోయారు. ఈ ఘటనను చూసి చలించిపోయిన డ్యూనంట్ .. తన వ్యాపారం గురించి మరచిపోయి ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. యుద్ధం ముగిసాక గాయపడిన వారికి సహాయం చేయాలి, ఇది మానవ ధర్మం అని విజప్తి చేశారు. 1864లో జెనీవాలో అంతర్జాతయ సమావేశంలో రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు కోసం 14 దేశాలు అంగీకారం తెలిపాయి. ఇది ప్రైవేట్ సంస్థ .. దీనికి అనుబంధంగా కూడా సంస్థలు పనిచేస్తున్నాయి. తొలినాళ్లలో ఇది కేవలం యుద్ధాల్లో గాయపడినవారికి మాత్రమే సేవలు అందించేది .. తర్వాత క్రమంగా అందరికీ సేవ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ వ్యాపించి ఉంది.
విధులు
రెడ్ క్రాస్ ముఖ్య విధులు ప్రథమ చికిత్స, మంచినీటిని పరిశుభ్రంగా ఉంచడం, నర్సులకు శిక్షణ ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడం, మెడికల్ కాలేజీ స్థాపించి .. రక్తనిధులను సేకరిస్తారు. యుద్ధ సమయాల్లో గాయపడ్డవారికి ప్రథమ చికిత్స చేసే వీరు .. క్రమ క్రమంగా సేవలను విస్తరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధఖైదీలను అప్పగించే సమయంలో రెడ్ క్రాస్ సంస్థ తమ విధులను నిర్వర్తిస్తోంది. వారికి వైద్య పరీక్షలు చేసి .. అప్పగించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏలాగూ ఇరుదేశాలు ఎవరినీ నమ్మేస్థితిలో లేనందున .. రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వంతో ఏ సమస్య ఉండదు.