మోడీతో కలిసి చదువుకున్న ఆ సీఎం ఎవరు..! అసలు మోడీ విద్యార్హతలేంటి
'భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏం చదువుకున్నారు..? ఎంతవరకు చదువుకున్నారు..?' ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం ద్వారా మోడీ విద్యార్హతలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడిదో హాట్ టాపిక్.
గుజరాత్ పత్రిక అహ్మదాబాద్ మిర్రర్ బయటపెట్టిన వివరాల ప్రకారం.. విస్ నగర్ లోని ఎం.ఎన్ సైన్స్ కాలేజీలో ఎం.ఏ పాలిటిక్స్ ను అభ్యసించిన మోడీ 1983లో 62.3 శాతం మార్కులతో ఫస్టు క్లాసులో పాసయ్యారని పేర్కొంది. అంతేకాదు.. అదే సమయంలో ప్రస్తుత గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ కూడా ఎంఎన్ కాలేజి నుంచే ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేశారని తెలిపింది. మరో విశేషమేంటంటే..! ఈ ఇద్దరూ చదివిన కోర్సులు వేరైనా.. వేర్వేరు తరగతుల్లో విద్యను అభ్యసించినా ఇద్దరి రోల్ నంబర్ ఒక్కటే కావడం. వీరిద్దరి రోల్ నెంబర్ 71 అని ప్రచురించింది అహ్మదాబాద్ మిర్రర్.
ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టాక.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో ఆనంది బెన్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆనంది బెన్ పటేల్ ప్రస్తుతం గుజరాత్ సీఎంగా ఉన్నారంటే దానికి కారణం ఒకవిధంగా మోడీయే అని చెప్పుకోవచ్చు. ఆనంది బెన్ పనితనం కంటే కూడా మోడీ చేసిన సిఫార్సులే ఆమె సీఎం అవడానికి ప్రధాన కారణమనేది అందరికీ తెలిసిన సత్యమే.
ఇదంతా పక్కనబెడితే.. ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటీల నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా మోడీ విద్యార్హతల కోసం దరఖాస్తు చేసుకున్న కేజ్రీవాల్ కు ఆ వివరాలు ఇంకా అందకముందే అహ్మదాబాద్ మిర్రర్ మోడీ విద్యార్హతలపై కథనం రాయడం ఆసక్తిని రేపుతోంది. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్వయంగా కలగజేసుకుని కేజ్రీవాల్ కోరిన వివరాలు అందించాలని ఆదేశాలిచ్చినా..! ఆ వివరాలను వెతకి పట్టుకోవడం కష్టమని వర్సిటీలు చెప్పడం గమనార్హం. దీంతో ఏకంగా ప్రధాని మంత్రి కార్యాలయ అధికారులనే ఆ వివరాలు వెల్లడించాల్సిందిగా చేశారు శ్రీధర్. ఏదేమైనా కేజ్రీవాల్ కి ఆ వివరాలు అందకముందే అహ్మదాబాద్ మిర్రర్ అదే విషయాన్ని వెల్లడించడం ఇప్పుడు చర్చలకు తావిచ్చే అంశంగా మారింది.