గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?
సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు. ఆయనే జీసస్. క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడ్డాడు. యేసు క్రీస్తు మరణిస్తే శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నాము ..? అసలు శుభం ఎలా అవుతుంది..?
మానవాళి పాపాల కోసం సిలువపై ప్రాణాలు అర్పించిన జీసస్
గుడ్ ఫ్రైడే ... శుభశుక్రవారం. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.
వివిధ దేశాల్లో గుడ్ ఫ్రైడేకు పలు రకాల వివరణలు
ఇదిలా ఉంటే గుడ్ ఫ్రైడే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అయితే గుడ్ ఫ్రైడే అనే ఈ పేరు ఎలా వచ్చిందో అనేదానికి పలువురు పలు రకాలుగా వారి వాదనలు వినిపిస్తున్నారు. శుభ శుక్రవారంలో ఏదో మంచి ఉందని చాలా మంది భావిస్తారు. యేసు ప్రభువు సమస్త మానవాళి చేసిన పాపాలకు తన ప్రాణాలు అర్పించి పునరుత్తానం చెందాడని చెబుతారు. మరికొందరు గుడ్ అనే పదం ఇంగ్లీషులో ఏమైతే అర్థం ఇస్తుందో దాని ప్రకారంగానే హోలీ ఫ్రైడే అని పిలుస్తారని చెప్తారు. లెంట్ కాలంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈ సమయంలో క్రైస్తవులు మాంసాహారం తీసుకోరు. గుడ్ ఫ్రైడే రోజున ఒక సారి పూర్తి స్థాయి భోజనం మరో రెండు పూట్ల ఫలహారం తీసుకుంటారు.
పొరుగువారిని ప్రేమించి వారిని క్షమించాలి: యేసుప్రభువు
ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ ఒక్కొక్క పద్దతిని పాటిస్తారు. కొందరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు. క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్ఫ్రైడే. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ కూడా జీసస్ పుట్టుక గురించి ఆయన పుట్టిన తేదీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రభువును శిలువ వేయడాన్ని గురించి ప్రస్తావించింది. యూదా ఇస్కరియోత్ అనే యేసు ప్రభువు శిష్యుడు కేవలం 33 వెండి నాణేల కోసం యేసు ప్రభువుకు నమ్మక ద్రోహం చేస్తాడు. క్రీస్తు ఎక్కడున్నాడో సైన్యానికి చెప్పేస్తాడు. ఆ తర్వాత క్రీస్తును తీసుకురావడం ఆయన్ను సిలువ వేయడం సిలువపై వ్రేలాడి ఉండగా ప్రభువు చివరిగా మాట్లాడే ఏడు మాటలను క్రైస్తవులు ఈ రోజు గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రీస్తు యేసు తాను భూమిపై బతికున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది తమ పొరుగువారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్తారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు.