వాట్సాప్ సంచలన నిర్ణయం: ఇకపై ఎన్ని మెసేజ్లు పంపొచ్చో తెలుసా..?
కోవిడ్-19 ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంతకంటే వేగంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు వార్తలను నమ్మినవారు చాలా నష్టపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సోషల్ మీడియా యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో ఆ తప్పుడు వార్తలకు బ్రేక్ పడటం లేదు. ఇక కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్ తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల ద్వారా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్లపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది వాట్సాప్ యాజమాన్యం. తరచూ ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్లను ఒకరు ఒక చాట్ బాక్స్కు మాత్రమే ఇకనుంచి ఫార్వర్డ్ చేసేలా చర్యలు తీసుకుంది. ఇదివరకు ఆ మెసేజ్ ఐదు చాట్బాక్స్లకు ఫార్వర్డ్ చేసే వీలుండేది. ఇప్పుడు దాన్ని ఒక్క చాట్బాక్స్కే పరిమితం చేయడంతో ఫేక్ న్యూస్ ప్రచారాన్ని చాలావరకు కట్టడి చేయొచ్చనే అభిప్రాయంతో వాట్సాప్ ఉంది.
లాక్డౌన్ నేపథ్యంలో రెట్టింపు అయిన మెసేజ్లు
కరోనావైరస్ లాంటి విపత్కర సమయాల్లో ఫేక్ న్యూస్ చాలా వేగంగా ప్రచారంలోకి వెళ్లిపోతున్నాయని ఆంక్షలు విధించడం వల్ల వేగంతో పాటు తక్కువమందికే ఫేక్ న్యూస్ చేరుతుందని వాట్సాప్ స్పష్టం చేసింది. భారత్తో పాటు ఇతర ప్రపంచదేశాలు కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే వాట్సాప్ మెసేజ్లు మరింత పెరిగాయి. ఇందులో ఎక్కువ భాగం ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్లు చాలా అధికంగా ఉంటున్నాయని యాజమాన్యం చెప్పింది.
ఒక చాట్బాక్స్కు ఒక మెసేజ్ మాత్రమే
ఇందులో చాలా వరకు తప్పుడు సమాచారమే ఇతరులకు మెసేజ్ల ద్వారా చేరుతోందని యాజమాన్యం చెబుతోంది. అందుకే ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఒక చాట్బాక్స్కు మాత్రమే చేరేలా చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం వివరించింది. అయితే మిగతా వాళ్లకు ఆ మెసేజ్ను పంపలేరు అని దానర్థం కాదని... నేరుగా ఫార్వర్డ్ చేయకుండా మెసేజ్ను కాపీ చేసి పంపాల్సిన వారి చాట్ బాక్స్కు వెళ్లి పేస్ట్ చేస్తే సరిపోతుందని వెల్లడించింది. ఇక వాట్సాప్ తీసుకొస్తున్న ఈ మార్పు కచ్చితంగా వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ను నియంత్రించడంలో సక్సెస్ అవుతుందని వాట్సాప్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ మంది వాట్సాప్ యూజర్లు ఉండగా... భారత్లో 400 మిలియన్ మంది ఉన్నారు. వాట్సాప్ తీసుకున్న తాజా నిర్ణయం చాలా మంచిదని పలువురు ప్రశంసిస్తున్నారు.