పాకిస్తాన్లో అర్ధరాత్రి ఇలా వద్దు: గంగూలీకి ముషారఫ్ స్వీట్ వార్నింగ్!
కరాచీ: 2004లో భారత్ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా తనకు పర్వేజ్ ముషారఫ్ ఫోన్ చేసి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. దాదా 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ' ఆత్మకథలో ఆసక్తికర విషయం పేర్కొన్నారు.
పాకిస్తాన్లో అర్ధరాత్రుళ్లు సాహసం చేయవద్దని ముషారఫ్ సూచించినట్లు పేర్కొన్నారు. నాడు పాకిస్తాన్ పర్యటన సందర్భంగా టీమిండియా లాహోర్లోని స్విస్ పెరల్ కాంటినెంట్ హోటల్లో దిగింది.
అర్ధరాత్రి బయటకు వెళ్లి తినాలనుకున్నాడు
ఆ హోటల్లో సెక్యూరిటీ అత్యంత కట్టుదిట్టంగా ఉంది. ఈ వన్డే సిరీస్లో భారత్ 3-2తో పాకిస్తాన్ పైన నెగ్గింది. ఊపిరాడకుండా ఉన్న సెక్యూరిటీ నుంచి గంగూలి బయటకు రావాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో సరదాగా బయటకు వెళ్లి ఏవైనా ఆహారం తినాలనుకున్నాడు.
అక్కడ తినాలని
ఆ పుస్తకంలో గంగూలీ ఇలా పేర్కొన్నారు. అంతకుముందు రాత్రి తన సన్నిహితులు అక్కడ పేరుగాంచిన ఆహారపదార్థాలు ఉండేచోట కబాబ్, తందూరీ డిషెస్ తినాలని ప్లాన్ వేశారు. ఆ ప్రాంతాన్ని గావల్మండి అంటారు.
సెక్యూరిటీకి చెప్పకుండా
అర్ధరాత్రి తినడానికి తాను బయటకు వెళ్తే అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంటారని గుర్తించానని గంగూలీ పేర్కొన్నారు. అందుకే కేవలం తమ టీమ్ మేనేజర్ రత్నాకర్ శెడ్డికి మాత్రమే చెప్పాను. సగం ముఖం కనిపించకుండా తలకు టోపీ ధరించి హోటల్ నెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లానని గంగూలీ పేర్కొన్నారు.
ముషారఫ్ చెవిన పడింది
మేమంతా డిన్నర్ పూర్తి చేశామని, జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తనను గుర్తు పట్టారని, ఆయన తనను పిలవడం మొదలు పెట్టారని, తిన్న తర్వాత బిల్లు ఇస్తే షాప్ కీపర్ తీసుకోలేదని, మీలాంటి కెప్టెన్ మాకు (పాకిస్తాన్)కు కావాలని చెప్పాడని, అప్పుడు జనాలు తమవైపు వచ్చారని గంగూలీ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత హోటల్ రూంకు సేఫ్గా వచ్చారు. ఈ విషయం ముషారఫ్ చెవిన పడిందన్నారు.
మేమే సెక్యూరిటీని ఇస్తాం
తాను హోటల్ రూంకు చేరుకునేసరికి ముషారఫ్ ఫోన్ చేశాడని గంగూలీ పుస్తకంలో పేర్కొన్నారు. ఇంకోసారి బయటకు వెళ్లాలనుకుంటే సెక్యూరిటీకి సమాచారం ఇవ్వాలని, మేం మీ వెంట భద్రతా సిబ్బందిని పంపిస్తామని, కానీ ఇలాంటి సాహసాలు చేయవద్దని ముషారప్ చెప్పినట్లు గంగూలీ పేర్కొన్నారు.