మరో 48 గంటలు గడువిస్తున్నాం.. మీ యాక్షన్ ఏంటో చూస్తాం: పాకిస్తాన్కు అమెరికా డెడ్లైన్
వాషింగ్టన్: ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్కు మరో 48 గంటలు సమయం ఇస్తున్నామని, ఈ గడువులోగా ఆశించిన చర్యలు తీసుకోలేకపోతే ఆ దేశంపై అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటుందని శ్వేతసౌధం వెల్లడించింది.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ప్రభావం కారణంగా పాకిస్తాన్కు రూ.1700 కోట్ల నిధులను అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా శ్వేతసౌధం ప్రతినిధి సారా శాండర్స్ పాకిస్తాన్పై మరో బాంబు పేల్చారు.
'ఉగ్రవాదాన్ని అడ్డుకుని ఆపగలిగే శక్తి పాకిస్తాన్కు ఉంది. పాక్ ఆ పని చేయాలి కూడా. ఆ దేశం నుంచి మేం ఆశిస్తున్నది కూడా అదే. మరో 48 గంటలు వేచి చూస్తాం. పాక్ నుంచి సరైన స్పందన కానరాకపోతే ఆ దేశంపై మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం..' అని ఆమె వ్యాఖ్యానించారు.
'పాకిస్తాన్ ఏళ్లతరబడి డబుల్ గేమ్ ఆడుతోంది..' అంటూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యానించిన కాసేపటికే శ్వేతసౌధం ప్రతినిధి సారా శాండర్స్ పాకిస్తాన్ వ్యవహారంపై స్పందించడం గమనార్హం.
ఇప్పటికే ట్రంప్ ట్వీట్ను పాకిస్తాన్ ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో తమ దేశం అమెరికాకు అన్ని రకాలుగా సహకరిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరిప్పుడు నిక్కీ హేలీ, సారా శాండర్స్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.