చరిత్రలో తొలిసారి: హూస్టన్ వేదికగా జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మోడీ-ట్రంప్ ప్రసంగం
వాషింగ్టన్ : కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్లో జరిగిన జీ-7 సమ్మిట్లో భాగంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ ఓ ప్రత్యేక మెగా ఈవెంట్లో పాల్గొననున్నారు. హూస్టన్లో జరిగే ఈ కార్యక్రమంకు హౌడీ మోడీగా నామకరణం చేశారు. ఈ ప్రోగ్రామ్లో మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్నారు. సెప్టెంబర్ 22న జరగనున్న ఈ కార్యక్రమంలో తొలిసారిగా ఇద్దరు అగ్రనేతలు ఓ ర్యాలీని ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగించనున్నారు.
హూస్టన్లో హౌడీ మోడీ కార్యక్రమంలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూస్టన్ ర్యాలీకి హాజరవుతారా లేదా అన్న మీమాంస నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ర్యాలీకి హాజరుకానున్నట్లు వైట్హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. కొన్ని వారాల సమయంలోనే మోడీ - ట్రంప్ల భేటీ కావడం ఇది మూడో సారి. అంతకుముందు జీ-20 , జీ-7 సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 50వేల మంది భారతీయులు మరియు అమెరికన్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ర్యాలీకి హూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియం వేదికకానుంది. హౌడీ అంటే ఇంగ్లీషులో హౌడూయూడూ అని అర్థం. అమెరికా నైరుతీ ప్రాంతంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. ఒకరిని గ్రీట్ చేసేందుకు హౌడీ అనే పదంను అక్కడివారు వినియోగిస్తారు.
హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొననున్న ట్రంప్
హౌడీ మోడీ కార్యక్రమంలో భారత ప్రధాని మోడీతో కలిసి ట్రంప్ పాల్గొంటారని ... ఈ భేటీతో అమెరికా భారత్ల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వైట్హౌజ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాల మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు బలపడుతాయని వైట్హౌజ్ ప్రకటన తెలిపింది. వాణిజ్య సంబంధాలతో పాటు ఎనర్జీ రంగంలో కూడా సంబంధాలు మరింత మెరుగవుతాయని వైట్హౌజ్ విడుదల చేసిన ప్రకటనలో ఉంది. ఇక ఇండో అమెరికన్లను ఉద్దేశించి ఒకే చోట అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే తొలిసారి కానున్నదని ప్రకటన పేర్కొంది.
మోడీతో పాటు ట్రంప్ ప్రసంగిస్తారు: వైట్హౌజ్
హౌడీ మోడీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడం చారిత్రాత్మకమైన విషయం అని అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు. భారత్ అమెరికాల మధ్య స్నేహం, సహకారాలు ఎప్పటికీ కొనసాగుతాయని చెప్పేందుకు ఈ వేడుక ఒక సూచిక అని ఆయన వెల్లడించారు. ఇరుదేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలు నెలకొనేందుకు ఈ ర్యాలీ మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే జీ-7 సమ్మిట్లో భాగంగా ఇరు దేశాధినేతలు భేటీ అయిన సందర్భంలో ప్రధాని మోడీ తాను పాల్గొనబోయే హౌడీ మోడీ కార్యక్రమానికి రావాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించినట్లు వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇండో అమెరికన్లతో ట్రంప్ భేటీ
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికకాక ముందు తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇండో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. తాను అధ్యక్షుడైతే భారత్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అమెరికాలోని భారత సమాజంను గురించి ప్రసంగించడం ఇది మోడీకి మూడవసారి కానుంది. 2014లో మేడిసన్ స్క్వేర్లో తొలి ప్రసంగం చేయగా... సిలికాన్ వ్యాలీలో 2016లో రెండోసారి ప్రసంగించారు. రెండు కార్యక్రమాల్లో దాదాపు 20వేలకు పైగా ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. ఇక హౌడీ హూస్టన్ కార్యక్రమంను టెక్సాస్ ఇండియా ఫోరం అనే సంస్థ నిర్వహిస్తోంది. టెక్సాస్లోని ఇండో అమెరికా సంస్థల తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.