అమెరికాలో ‘తెలుపు’ ఆధిపత్యానికి తెర: 2020 నాటికి మెజార్టీ వర్గంగా మైనార్టీలు
న్యూయార్క్: అమెరికాలో అధికంగా ఉన్న శ్వేతజాతీయుల ఆధిపత్యానికి మరికొద్ది సంవత్సరాల్లో తెర పడనుంది. 2020 సంవత్సరం నాటికి అల్పసంఖ్యాక (మైనార్టీ) వర్గాలకు చెందిన పిల్లలే దేశ జనాభాలో సగానికిపైగా ఉంటారని, దీంతో శ్వేతజాతీయులు ఇక ఎంతో కాలం పాటు అధికసంఖ్యాక (మెజార్టీ) వర్గంగా కొనసాగలేరని అమెరికా జనాభా లెక్కల సంస్థ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
శ్వేతజాతీయుల ఆధిపత్యానికి ముగింపు పలికే దిశగా అమెరికా పయనిస్తోందని, వీరి స్థానంలో మైనార్టీ వర్గాల పిల్లలు దేశ జనాభాలో సింహభాగాన్ని ఆక్రమించబోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. అమెరికాలో మొత్తం మీద రానున్న కొద్ది సంవత్సరాల్లో జనాభా చాలా నెమ్మదిగా పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న జనాభాలో చాలా ఎక్కువ మంది వృద్ధులుగా మారబోతున్నారని స్పష్టం చేసింది.
దాదాపు 2020 సంవత్సరం నాటికి అమెరికాలోని చిన్నపిల్లల్లో అల్పసంఖ్యాక వర్గాలు లేదా తెగలకు చెందినవారే సగానికిపైగా ఉంటారని, ఆ తర్వాత మరో 20 ఏళ్ల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఈ నివేదిక తెలిపింది. అమెరికా జనాభా ముఖచిత్రం 2044 నాటికి పూర్తిగా మారిపోతుందని, అప్పటికి దేశంలో పరిమాణరీత్యా ఏ వర్గం లేదా తెగ ఆధిపత్యాన్ని చెలాయించే స్థితిలో ఉండబోదని సంస్థ అంచనా వేసింది.
రానున్న కొద్ది దశాబ్దాల పాటు అమెరికా జనాభా చాలా నెమ్మదిగా పెరుగుతుందని, దేశంలో జననాల రేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక పేర్కొంది. 2051 నాటికి అమెరికా జనాభా 40 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వారం విడుదల చేసిన జనాభా లెక్కల నివేదికలో ఈ వివరాలను తెలిపింది.