భారత్కు కృతజ్ఞతలు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ: ఆ కీలక నిర్ణయమే కారణం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు. అంతేగాక, భారత ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు బుధవారం ఉదయం డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు మాండవీయ ప్రకటన చేసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ మేరకు స్పందించింది.
'వచ్చే అక్టోబర్ నుంచి కరోనా వ్యాక్సిన్ల షిప్మెంట్ను తిరిగి ప్రారంభిస్తున్నందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ధన్యవాదాలు. ఈ ఏడాది ఆఖరుకు అన్ని దేశాలు 40 శాతం వ్యాక్సినేషన్ను సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ సాయం చాలా కీలకం కాబోతోంది' అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు.
ఆరోగ్య సంస్థ, గవి వ్యాక్సిన్ ఆలయన్స్ ఆధ్వర్యంలో కోవాక్స్ కార్యక్రమం నడుస్తోంది. పలు దేశాల నుంచి టీకాలను సేకరించి, అంతర్జాతీయంగా పంపిణీ చేస్తోంది. అయితే, భారత్ ఎగుమతి నిలిపివేయడం ఈ కార్యక్రమంపై ప్రభావం చూపింది. కాగా, కరోనా టీకా ఉత్పత్తిలో ముందువరుసలో ఉన్న భారత్.. దేశంలో టీకాలు అందుబాటులోకి వచ్చిన సమయంలోనే పలు దేశాలకు ఎగుమతులు, విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఏప్రిల్ నెలలో కరోనా రెండ దశ ప్రారంభం కావడంతో భారత్ వ్యాక్సిన్ మైత్రిని తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పట్నుంచి స్వదేవంలో టీకా కార్యక్రమంపైనే దృష్టి పెట్టింది. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో టీకాలు అందిస్తూ.. కేంద్రం విధించుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిగులు టీకాలను అక్టోబర్ నెల నుంచి ఎగుమతి చేస్తామని భారత ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను వ్యాక్సిన్ మైత్రి, కోవాక్స్కు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్కు ధన్యవాదాలు తెలిపింది.
ఇప్పటికీ వ్యాక్సిన్లు అందని దేశాలు ఎన్నో ఉన్నాయని, ఇలాంటి వారికి భారత నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత పెంచనుంది.
దేశంలో ఇప్పటికే 82 కోట్ల మందికిపైగా కరోనా డోసుల పంపిణీ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, కోవాక్స్కు సరఫరా చేయనున్నట్లు రెండ్రోజుల క్రితం కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ మాసంలో 30 కోట్లకు పైగా డోసులు, వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 100 కోట్లకుపైగా టీకా డోసులు అందుతాయని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మన దేశ పౌరులకు వ్యాక్సిన్ అందించిన తర్వాతనే, మిగులు టీకాలను విదేశాలకు ఎగుమతి చేయడం, విరాళాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వసుదైక కుటుంబం అనే నినాదానికి అనుగుణంగా అక్టోబర్-డిసెంబర్ నెలల్లో వ్యాక్సిన్ మైత్రి, కోవాక్స్ ఎగుమతులు, విరాళాలుగా ఇస్తామన్నారు. కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరులో భాగంగా టీకాలను విదేశాలకు అందించడం జరుగుతోందన్నారు.
Thank you Health Minister @mansukhmandviya for announcing #India will resume crucial #COVID19 vaccine shipments to #COVAX in October. This is an important development in support of reaching the 40% vaccination target in all countries by the end of the year. #VaccinEquity
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) September 21, 2021
ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో కరోనా టీకాల పరిశోధన ఉత్పత్తి ఏకకాలంలో భారీ ఎత్తున కొనసాగుతాయని కేంద్రమంత్రి వివరించారు. భారత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచ దేశాలకు ఓ రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని తెలిపారు. గతంలో భారత్ దాదాపు 100 దేశాలకు 6.6 కోట్ల డోసుల వ్యాక్సిన్లను విక్రయాలు, విరాళంగా అందించిందని తెలిపారు. అయితే, దేశంలో కరోనా సెకండ్ వేవ్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడటంతో విపక్షాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విదేశాలకు టీకాల ఎగుమతులు, విరాళాలు నిలిపివేసింది.